ఖైరతాబాద్, జూలై 21 : అరుదైన గుండె జబ్బుతో జన్మించిన ఓ శిశువుకు విజయవంతంగా చికిత్స నిర్వహించి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించారు లక్డీకాపూల్లోని లోటస్ దవాఖాన వైద్యులు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వీఎస్వీ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. గత నెల 17న హైటెక్ సిటీలోని బైరాగిగూడ శివసాయినగర్కు చెందిన సౌందర్యకు నెలలు నిండకుండానే (8వ నెల) ఆడ శిశువు జన్మించింది. ఆ చిన్నారికి పరీక్షలు నిర్వహించగా, సిస్టమిక్ లూపస్ ఎరిథెమెటాసిస్ (ఎస్ఎల్ఈ) వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. తల్లి నుంచి కొన్ని ప్రతిరోధకాలు (ప్రొటీన్లు) పుట్టబోయే శిశువు రక్తంలోకి వెళ్లి, ఇవి గుండె కండరాల ఫైబర్లపై దాడి చేసి దెబ్బతీస్తాయి.
దీని వల్ల గుండె నుంచి మిగతా అవయవాలకు రక్తాన్ని సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. తద్వారా గుండె నెమ్మదిగా కొట్టుకోవడం, రక్తపోటు తగ్గడం వల్ల వారి ప్రాణానికే ప్రమాదంగా పరిణమిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 25 సంవత్సరాల వ్యవధిలో ఇలాంటి కేసులు సుమారు 20వరకు మాత్రమే నమోదయ్యాయి. దీంతో ఆ శిశువును నెల రోజుల పాటు ఐసీయూలో ఉంచి ఊపిరితిత్తులకు వైద్యం అందిస్తూ గుండె వేగం పెరిగేలా చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి రక్షించామని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. శిశువు పూర్తిగా కోలుకొని సాధారణ స్థితికి చేరుకోవడంతో బుధవారం డిశ్చార్జి చేసినట్లు చెప్పారు.