న్యూఢిల్లీ: అందరూ అనుకున్నట్లే కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్లోనే అభివృద్ధి చెందిందా..? చైనాకు ఈ విషయం తెలిసినా దాచిపెట్టిందా? ..ఇద్దరు అమెరికా నిపుణులు వెల్లడించిన కొన్ని విషయాలు ఇవి నిజమనే చెబుతున్నాయి. కొవిడ్-19కు పుట్టినిల్లు చైనా ల్యాబేనని వెల్లడిస్తున్నాయి.
చైనాలోని వూహాన్ నగరంలో 2019 డిసెంబర్లో కరోనా వైరస్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. అక్కడినుంచి ప్రపంచమంతా వ్యాపించింది. అయితే, కొవిడ్-19 వైరస్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచే లీక్ అయిందనే ఆరోపణలు వెలువడ్డాయి. కరోనా వైరస్ వ్యాప్తి చైనా పనేనని అమెరికా మొదటి నుంచి ఆరోపిస్తోంది. అయితే, ఇటీవల గుర్తించిన అరుదైన జన్యువులను పరిశీలిస్తే కరోనా వైరస్ చైనాలోని ల్యాబ్లోనే అభివృద్ధి చెందిందని తెలుస్తున్నదని ఇద్దరు అమెరికా నిపుణులు అంటున్నారు.
అమెరికన్ నిపుణులు డాక్టర్ స్టీఫెన్ క్వే, రిచర్డ్ ముల్లర్ ప్రకారం కొవిడ్-19 వ్యాధికారక జన్యు ఫుట్ప్రింట్ సహజ కరోనా వైరస్లో ఎప్పుడూ కనిపించలేదు. దీనిని బట్టి కరోనా వైరస్ కచ్చితంగా ల్యాబ్లోనే తయారైనట్లు తెలుస్తున్నదన్నారు. క్వే అమెరికాకు చెందిన బయోఫార్మాస్యూటికల్ కంపెనీ అటోసా థెరప్యూటిక్స్ స్థాపకుడు కాగా, ముల్లర్ కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్.
కొవిడ్ -19 లో సీజీజీ-సీజీజీ (దీనిని “డబుల్ సీజీజీ” అని కూడా పిలుస్తారు) జన్యుక్రమం ఉందని, ఇది 36 సీక్వెన్సింగ్ నమూనాలలో ఒకటి అని క్వే, ముల్లర్ వెల్లడించారు.
సీఓవీ-2తో తిరిగి కలపగల కరోనావైరస్ల తరగతిలో సీజీజీ చాలా అరుదుగా కనిపిస్తుందన్నారు. వాస్తవానికి సీఓవీ-2 ను కలిగి ఉన్న కరోనావైరస్ల మొత్తం తరగతిలో డబుల్ సీజీజీ కలయిక సహజంగా కనుగొనబడలేదన్నారు. అలాగే, ఇక్కడ పునసంయోగానికిగానీ, ఒక వైరస్ నుంచి ఇంకో వైరస్ జన్యుక్రమాన్ని పొందే అవకాశంగానీ లేదన్నారు. అలాగే, సార్స్, మెర్స్ రెండింటికీ సహజ మూలం ఉందని, మానవుల ద్వారా ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతూ ప్రమాదకరంగా మారుతుందన్నారు. అయితే, కొవిడ్-19 విషయంలో ఆ విధంగా జరుగలేదన్నారు. వైరస్ ప్రమాదకర రూపమే మొదట మనిషిలో కనిపించిందని, అటుతర్వాత వ్యాప్తి ప్రారంభమైందని వెల్లడించారు. దీనినిబట్టి కొవిడ్-19 ల్యాబ్లోనే అభివృద్ధి చెందినట్లు తాము నిర్ధారణకు వచ్చామన్నారు.