షాజహాన్పూర్ : ఇద్దరు వ్యక్తులు 12 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. అనంతరం మగ పిల్లాడ్ని కని ఒకరికి దత్తత ఇచ్చింది. పిల్లాడు పెరిగి పెద్దైన తర్వాత తన తండ్రి ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో పిల్లాడు ఉంటున్న గ్రామానికి తల్లి రావడం.. తనపై లైంగికదాడి జరిగిందని చెప్పడం.. కోర్టు ఆదేశాలతో వారిపై 27 ఏండ్ల తర్వాత కేసు నమోదు చేయడం.. ఒకదాని వెంట మరొకటి చకచకా జరిగిపోయాయి. ఈ ఘటన ఘాజీపూర్ జిల్లా పరిధిలోని ఉధమ్పూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉధమ్పూర్ గ్రామంలో ఓ 12 ఏండ్ల బాలిక.. అక్కాబావలతో కలిసి ఉంటున్నది. అయితే, అక్కాబావ ఇంట్లో లేని సమయంలో బాలికపై పొరుగున ఉండే నక్కి హసన్ కన్నుపడింది. ఇంట్లోకి వచ్చి మాయమాటలు చెప్పి ఆ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఇది చూసిన నక్కి హసన్ సోదరుడు గుడ్డు కూడా ఆ బాలికపై లైంగికదాడి చేశారు. దాంతో బాలిక 1994 లో తన 13వ యేట మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో బావకు రాంపూర్కు బదిలీ అవడంతో బాబును అదేగ్రామంలోని ఒకరికి దత్తత ఇచ్చి వెళ్లిపోయారు. అనంతర కాలంలో ఆమెకు ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెండ్లైన పదేండ్లకు తన భార్యపై లైంగికదాడి జరిగిందని తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇవ్వడంతో.. తిరిగి ఉధమ్పూర్ గ్రామానికి చేరుకున్నది. ఈ క్రమంలో ఈ మహిళకు పుట్టిన బాలుడు.. తన తండ్రి ఎవరనేది తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు. ఇదే సమయంలో ఆ మహిళ ఉధమ్పూర్ రావడంతో.. దత్తత తీసుకున్న వ్యక్తి ద్వారా ఆమెను కలవడం జరిగింది. దాంతో ఆమె తనపై జరిగిన లైంగికదాడిని కుమారుడికి వివరించింది. తనపై లైంగికదాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయాలంటూ సదరు మహిళ పోలీసులకు పిటిషన్ పెట్టుకోగా.. వారు తిరస్కరించడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. దాంతో షాహబాద్ పోలీసులు కేసు నమోదు చేశారని, డీఎన్ఏ పరీక్షలు జరుపనున్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సంజయ్ కుమార్ తెలిపారు. 27 ఏండ్ల తర్వాత తల్లి తన వద్దకు రావడంతో యువకుడు సంతోషం వ్యక్తం చేస్తూ.. నిందితులు ఇద్దరికీ శిక్ష పడేలా చేస్తానంటున్నాడు.