శతాబ్ద కాలంగా ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో పేరుకుపోతూ వచ్చిన అసంతృప్తి జ్వాల 1857 తిరుగుబాటు రూపంలో చెలరేగింది. దీన్నే సిపాయిల తిరుగుబాటు’గా పిలిచారు. ఆ పోరులో తెలంగాణ నేల కూడా భాగమైంది. రాంజీగోండు నాయకత్వంలో వెయ్యిమంది రోహిల్లాలు, గోండులు కలిసి బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించారు. బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడిగా రాంజీగోండు చరిత్రలో నిలిచిపోయాడు.
భారతదేశంలో 1836-60 కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోండ్వానా ప్రాంతంలో భాగం. ఇక్కడి ఆదివాసీలకు మర్సికోల్ల రాంజీగోండు బ్రిటిషర్ల అక్రమాలపై మర్లబడటం నేర్పించాడు. 1860 ప్రాంతంలో నాటి జునాగావ్ (అసిఫాబాద్) కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్నాడు. అదేసమయంలో ఉత్తర భారతదేశంలో ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసింది. బ్రిటిష్ సైన్యంతో ఝాన్సీ లక్ష్మిబాయి, నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్ పోరాడారు. ఆంగ్లేయుల బలగాల ముందు వారు నిలువలేక తలోదిక్కు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లాలు (రోహిల్ఖండ్) పెద్దసంఖ్యలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. మహారాష్ట్రలోని అజంతా, బస్మత్, లాతూర్, మఖ్తల్, తెలంగాణలోని నిర్మల్ తాలూకాలను పోరాట కేంద్రాలుగా చేసుకుని బ్రిటిషర్లపై పోరాటం మొదలెట్టారు. అదే సమయంలో నిర్మ ల్ తాలూకా లో ఉంటు న్న ఆంగ్లేయ కలెక్టర్, ఇక్కడి తాలూక్దార్ ఆగడాలు పెరిగిపోవడంతో రాంజీగోండు ఈ ప్రాంతంపై దృష్టిపెట్టాడు. తన గిరిసైన్యానికి, రోహిల్లా దండు తోడైంది. వారంతా రాంజీ సారథ్యంలో తిరుగుబాటు లేవదీశారు.
రాంజీ నాయకత్వంలో వెయ్యిమంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్ సమీపంలోని అడవులు, కొండలు, చెరువులను పోరాట కేంద్రాలుగా ఎంచుకున్నారు. బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పెట్టారు. నిర్మల్ కలెక్టర్ హైదరాబాద్లోని రెసిడెంట్కు సమాచారం ఇచ్చాడు. దీంతో కర్ణాటక ప్రాంతంలోని బళ్లారిలోగల స్వదేశీదళం కర్నల్ రాబర్ట్ ఆధ్వర్యంలో నిర్మల్ ప్రాంతానికి చేరుకుంది. రాంజీగోండు సైన్యంపై విరుచుకుపడింది. వారు ఆధునిక ఆయుధాలతో వచ్చినా రెండుసార్లు ఆదివాసీ వీరులు ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఓడించారు. దీంతో ఈ ప్రాంతంలో వీరిని ఓడించడం కష్టమని ఆనాటి పాలకులు భావించారు. అనంతరం దొంగదెబ్బతీసి, గోదావరినది సమీపంలోని సోన్ ప్రాంతంలో రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకున్నారు. వారందరినీ ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, నిర్మల్ శివారులో ఉన్న ఊడలుదిగిన మహా మర్రిచెట్టుకు ఉరితీశారు. ఈ ఘటన 1860 ఏప్రిల్ 9న జరిగినట్టు చరిత్రకారులు చెబుతారు. మాతృభూమి కోసం చిరునవ్వులతో ఉరికొయ్యలను ముద్దాడిన గోండు వీరుల స్పూర్తి ఆ తర్వాతి తరం స్వతంత్ర యోధులకు ప్రేరణగా నిలిచింది.