‘సృష్టిలో నవ్వగలిగే శక్తి, ఏడు రంగులను చూసే అదృష్టం కేవలం మనుషులకు మాత్రమే ఉంది. ఆ రెండు అనుభవాల్ని పంచే చిత్రమిది. జీవితంలోని ఏడు రంగులను చూపిస్తుంది’ అని అన్నారు త్రివిక్రమ్. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ‘రంగ్ దే’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నితిన్, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. నితిన్ మాట్లాడుతూ ‘సితార ఎంటర్టైన్మెంట్స్లో నేను చేసిన మూడో సినిమా ఇది. ఫ్లాపుల్లో ఉన్న ప్రతిసారి ఈ సంస్థ్థ నాకు హిట్ ఇచ్చింది. ఆ సెంటిమెంట్ ఈ సినిమాకు వర్కవుట్ అవుతుందనే నమ్మకముంది’ అన్నారు. సినిమాలో తాను చేసిన అను పాత్రతో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని, నితిన్తో తన కెమిస్ట్రీ బాగుంటుందని కీర్తిసురేష్ చెప్పింది. ‘అర్జున్ పాత్రకు నితిన్, అను పాత్రకు కీర్తిసురేష్ ప్రాణంపోశారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రోహిణి, నరేష్, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.