బంట్వారం, ఆగస్టు 18: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. అనేక చెరువులు, కుంటల్లోని పూడికను తొలగించడంతోపాటు పునరుద్ధరించి నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు కృషి చేశారు. దీంతో మండలంలోని కొల్లంచెరువు, సుల్తాన్పూర్ చెరువులతోపాటు పలు కుంటలు కూ డా నిండుకుండల్లా మారి ఏడాదంతా జలకళతో దర్శనమిస్తున్నా యి. ఆయా చెరువుల ఆయకట్టు కింద ఉన్న పొలాలు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల్లోని గొలుసుకట్టు చెరువులు పిచ్చి మొక్క లు, చెత్తాచెదారం, పూడికతీతతో నిండి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. దీంతో చెరువు ఆయకట్టు కింద ఉన్న రైతులు, వివిధ కులాల వారు జీవనోపాధి లేక పట్టణాలకు వలసవెళ్లారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చి చెరువులు, కుంటలను అభివృద్ధి చేసి రైతులు, ఇతర కులాలకు జీవనోపాధిని కల్పించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. అందుకోసమే ఆయన శ్రీకారంచుట్టిన పథకమే ‘మిషన్ కాకతీయ’
కొల్లం చెరువుకు పూర్వవైభవం..
మండల కేంద్రంలోని కొల్లంచెరువు కొన్నేండ్లుగా నిరాదరణ గురై రైతులకు చుక్క నీటిని కూడా అందించకుండా ఉండిపోయింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రెండు పూటలా అన్నం పెట్టాలనే సంకల్పంతో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టింది. గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన చెరువులను పునరుద్ధరించింది. చెరువుల పూడికతీత, కాలువల నిర్మాణం, చెరువు కట్టల బలోపేతం వంటి పనులను చేపట్టింది. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని కొల్లంచెరువు పునరుద్ధరణకు ప్రభుత్వం రూ 45.30 లక్షల నిధులను మం జూరు చేసింది. ఆ నిధులతో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడికతీత తీయడంతో.. ప్రస్తుతం చెరువు నీటితో నిండింది. నీటి సామర్థ్యం దాటి అదనపు నీరు అలుగు నుంచి వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. చెరువు కింద ఉన్న 360 ఎకరాల ఆయకట్టు రైతుల పొలాలకు నీటిని అందించేందుకు 160 మీటర్ల సీసీ కాలువను నిర్మించారు. గతంలో నీటిని వదిలేందుకు నిర్మించిన తూము విరిగిపోయి, శిథిలావస్థకు చేరగా.. ఈ తూమును మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా పునరుద్ధరించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలోని చెరువు మట్టికట్టకు లీకేజీలుండటంతో వాటిని అధికారులు అరికట్టా రు. ఇందుకోసం 650 మీటర్ల పొడవు ఉన్న కట్టను 3 మీటర్ల ఎత్తుకు పెంచారు. చెరువు 25 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి సామర్థ్యాన్ని తట్టుకొని ఉండేలా చెరువుకట్టను బలోపేతం చేశారు. ఇటీవల కురుస్తు న్న వర్షాలకు చెరువు పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ ఏడాది రెండు పంటలకు ఇబ్బందుల్లేవని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో రెండు కుంటల నిర్మాణం..
మూడో విడుత మిషన్ కాకతీయ పథకంలో భాగంగా మండలంలోని రెండు కుంటల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిం ది. ఒకటి మాలసోమారంలోని మోత్కులకుంట కాగా.. రెండోది సుల్తాన్పూర్లోని కుంట … సుల్తాన్పూర్కుంట అభివృద్ధి, పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ 14.50 లక్షల నిధులను కేటాయించగా.. ఈ పనులను 2016 జూన్లో నాటి ఎమ్మెల్యే సంజీవ్రావు ప్రారంభించగా.. ఈ పనులు అనుకున్న సమయంలోనే పూర్తయ్యాయి. ఈ కుంట కింద ఉన్న సుమారు 25 ఎకరాలకు సాగునీరు అందుతున్నదని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దిగువ ప్రాంతంలోని బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. అదేవిధంగా సోమారంలోని మోత్కులకుంటను కూడా అధికారులు గడువులోపే పూర్తి చేసి.. రైతులకు సాగు నీటిని అందిస్తున్నారు.
రెండు చెరువుల పునరుద్ధరణతో..
సుమారు రూ. కోటి నిధులతో మండలంలోని కొల్లంచెరువు, సుల్తాన్పూర్ చెరువుల పునరుద్ధరణ పనులను ప్రభుత్వం చేపట్టింది. దీంతో చెరువుల్లోని పూడిక తీత, పిచ్చి మొక్కలు, కంపలను తొలగించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఈ రెండు చెరువులు నిండు కుండలా మారాయి. ఈ చెరువుల ఆయకట్టు కింద ఉన్న సుమారు 300 ఎకరాల్లోని పంట పొలాల్లో రైతులు రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఈ చెరువుల్లో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను వదలడంతో.. అవి పెరిగి పెద్దవి కావడంతో వాటిని విక్రయిస్తూ మత్స్యకారుల కుటుంబాలు కూడా జీవనోపాధిని పొందుతున్నాయి.
పొలాలు పచ్చగా మారాయి..
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రైతులకు ఎంతగానో దోహదపడుతున్నది. చెరువులు, కుంటల్లోని పూడిక, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. దీంతో రైతులు ప్రతి ఏడాది రెండు పంటలను సాగుచేసుకుని ఆనందంగా జీవిస్తున్నారు. అంతేకాకుండా చెరువులు, కుంటల మట్టి కట్టలను బలోపేతం చేయడంతో లీకేజీలకు అవకాశం లేకుండా పోయింది. -ఎండీ ఖాజాపాషా, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు
నీటి కష్టాలు తీరాయి..
మా గ్రామంలోని కుంటను పునర్నిర్మించడంతో నీటి మట్టం పెరిగి నీటి కష్టాలు తీరాయి. కుంటను పునరుద్ధరించడం ద్వారా గ్రామంలోని పాడి పశువులకు ఎంతగానో దోహదపడుతున్నది. కుంట దిగువ ప్రాం తంలోని బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరిగింది. కుంటలోని నీటి నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచితే బాగుండేది. కుంట ఆయకట్టు కింద రెండు పంటలు సాగవుతున్నాయి.
– లాజర్, రైతు సుల్తాన్పూర్