ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం సంబురాల్లో భాగంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించగా.. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, యువత అధిక సంఖ్యలో రక్తదానం చేసి సమైక్యతా స్ఫూర్తిని చాటారు.
బడంగ్పేట, ఆగస్టు 17 : ఆపద కాలంలో రక్తం అందుబాటులో లేనివారికి రక్తం ఇచ్చి ప్రాణదానం చేయవచ్చని.. యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలోని అతిథి గృహంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా జరుపాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రక్తదాన శిబిరాలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసిన వారిని మంత్రి అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్, మార్కెట్ చైర్మన్ సురేందర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాజునాయక్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో 326 మందికి రక్తదానం
పరిగి, ఆగస్టు 17 : వికారాబాద్ జిల్లా పరిధిలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్లలో బుధవారం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు. జిల్లావ్యాప్తంగా నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో 326 మంది రక్తదానం చేశారు. జిల్లాలో అత్యధికంగా పరిగిలో 140 మంది, తాండూరులో 78, వికారాబాద్లో 76, కొడంగల్లో 32 మంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి పలువురు పండ్లు, జ్యూస్ అందజేశారు.
యువత రక్తదానం చేయాలి
– చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్లటౌన్, ఆగస్టు 17 : రక్తదానం చేయడంలో యువత ముందుండాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్లలోని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తం దొరకక ఎంతో మంది నిండు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. 18 నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా మూడు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ మాలతి, చేవెళ్ల సర్పంచ్ శైలజ, చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్పల్లి మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
రక్తదానం బాధ్యతగా భావించాలి
– పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి
పరిగి, ఆగస్టు 17 : రక్తదానం చేయడంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పరిగిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తలసీమియా వ్యాధిగ్రస్తులకు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడినవారు తదితరులకు రక్తం అవసరమన్నారు. అందువల్ల ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా భావించి రక్తదానం చేయాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 100 మంది పోలీసులు, యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ విద్యాసాగర్రెడ్డి, సీఐ వెంకటరామయ్య, ఎంపీపీ అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ ప్రదీప్కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, పరిగి, చన్గోముల్ ఎస్ఐలు విఠల్రెడ్డి, భీమ్కుమార్ పాల్గొన్నారు.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు
– ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్
షాద్నగర్/షాద్నగర్టౌన్, ఆగస్టు 17 : రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. షాద్నగర్ ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఎంతో మంది సరైన సమయానికి రక్తం అందక ఇబ్బందులు పడుతున్నారని, రక్తదానంతో ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తదానంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని, ప్రతిఒక్కరూ రక్తదానం చేయొచ్చన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా షాద్నగర్ మున్సిపాలిటీలో కొనసాగుతున్న నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలో వ్యాసరచన, ముగ్గుల, చిత్రలేఖనం పోటీలను నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఆర్డీవో రాజేశ్వరి, కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, ఎంపీడీవో వినయ్కుమార్, కొత్తూరు ఎంపీడీవో శరత్బాబు, సీఐ నవీన్కుమార్, కౌన్సిలర్లు నర్సింహ, శ్రీనివాస్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పద్మలత, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, నాయకుడు యుగేందర్, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.