బొంరాస్పేట, అక్టోబర్ 4: మండలంలో యాసంగి వ్యవసాయ పనులు జోరుగా కొన సాగుతున్నాయి. వేరుశనగ విత్తనాలు వేసే పనుల్లో అన్నదాతలు బిజీగా ఉన్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో రైతులు యాసంగి సాగుకు ఉత్సాహంగా సిద్ధమ వుతున్నారు. యాసంగిలో రైతులు ఎక్కువగా వేరుశనగ పండిస్తుంటారు. ప్రభుత్వం తుంపర సేద్యానికి ప్రోత్సాహం ఇస్తుండడంతో దానిని సద్వినియోగం చేసుకుని రైతులు బోర్ల కింద తుంపర సేద్యంతో వేరుశనగ సాగుకు సమాయత్తమవుతున్నారు.
వాన కాలంలో చెల్క భూముల్లో వర్షాధారం కింద సాగు చేసిన పెసర, బెబ్బెర, మినుములు వంటి పంటలు రైతుల చేతికి వచ్చాయి. వాటి స్థానంలో యాసంగిలో వేరుశనగ పండిస్తారు. నెల రోజుల కిందటే భూములు దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధం చేసు కున్న రైతులు కొన్ని రోజుల కిందట మంచి వర్షాలు కురువడంతో జోరుగా విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
ప్రభుత్వం కూడా రైతులకు సకాలంలో రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సహాయాన్ని అందిస్తుండడంతో సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందుగానే కొనుగోలు చేసుకుని ఎలాంటి ఇబ్బందులు పడకుండా యాసంగి పనులకు సిద్ధమయ్యారు. భారీ వర్షాలతో బోర్లలో భూగర్భ జలాలు గణ నీయంగా పెరిగాయి. ఫలితంగా ఈ ఏడాది వేరుశనగ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని బొంరాస్పేట మండ లంలోనే యాసంగిలో వేరుశనగ పంటను ఎక్కువగా సాగు చేస్తారు.
మూడు మండలాల్లో 4400 హెక్టార్లలో వేరుశనగను సాగు చేసే అవకాశం ఉంది. బొంరాస్పేట మండలంలో 2400 హెక్టార్లు, దౌల్తాబాద్లో 1200 హెక్టార్లు, కొడంగల్లో 800 హెక్టార్లలో వేరుశనగ సాగు చేస్తారు. అనుకూల వర్షాలతో బోర్లలో భూగర్భజలాలు కూడా పెరగడంతో పం టలకు సాగునీరు అందుతుందని రైతులు భరోసాతో ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చి తమ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. రైతులు ఇప్పటికే విత్తనాలను కొనుగోలు చేశారు. మండలంలో వారం రోజుల నుంచి యాసంగి విత్తనాలు వేసే పనులు జోరుగా కొనసాగుతున్నాయి.