ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్నికేదైనా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి నుంచి హవా కొనసాగిస్తూ జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. తెలంగాణ ఉద్యమంలో పార్టీ చెంత చేరి స్వరాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న జిల్లా ప్రజలు.. స్వరాష్ట్రంలోనూ అండగా నిలుస్తూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనకు నచ్చి కారుకే జైకొడుతున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులందరూ టీఆర్ఎస్ పార్టీవారే ఉన్నారు. పార్టీలకతీతంగా ప్రతి గడపకూ ప్రభుత్వ ఫలాలు అందుతుండడంతో ఇతర పార్టీల నేతలు గులాబీ చెంతకు చేరి అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా గులాబీ పార్టీకంచుకోటగా మారింది.
రంగారెడ్డి, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ పార్టీదే హవా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ పేదల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో ఆయా పార్టీల నేతలతోపాటు సామాన్య ప్రజానీకం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి జై కొడుతున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన నాటి నుంచే ఇతర పార్టీల నుంచి కారెక్కారు. ఇక భవిష్యత్తు అంతా టీఆర్ఎస్దేనని గుర్తించిన ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలు మొదలుకొని కార్యకర్తల వరకు అందరూ గులాబీ కండువా కప్పుకోవడం గమనార్హం.
టీఆర్ఎస్కు కంచుకోటగా రంగారెడ్డి జిల్లా
రంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు అస్సలు కేడర్లేని టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పూర్తి కేడర్తో ఉంది. జిల్లాలో గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండగా ప్రస్తుతం టీఆర్ఎస్ నిలుపుకున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించిన వైఖరిపై టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. పార్టీ, కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు చేసిన ఉద్యమ తీవ్రతకు, సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే అప్పటి యూపీఏ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఏర్పాటు చేసినా.. కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వం ఇచ్చిందని ప్రచారం చేసుకోవడంలో విఫలమైంది.
రాష్ట్రం కోసం పదవులను త్యజించారు..
పదవులను త్యజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక ఎజెండాగా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన పార్టీ టీఆర్ఎస్. జిల్లాలోని షాద్నగర్లో తలపెట్టిన తొలి సభను ప్రజలు విజయవంతం చేయడంతో టీఆర్ఎస్ ప్రభంజనం షురూ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక్క కేసీఆర్తోనే సాధ్యమని ఇతర పార్టీల నేతల నుంచి సామాన్య ప్రజల వరకు కేసీఆర్తో కలిశారు. పార్టీ ఏర్పాటు చేసిన 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని పలు చోట్ల పోటీ చేయగా, జిల్లాలోని కేశంపేట జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పటి షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తరఫున మొట్టమొదటి జడ్పీటీసీగా గెలుపొందారు. అప్పటికే బలంగా ఉన్న టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి జిల్లాలోని కీలక నేతలు ఒక్కొక్కరు చేరడంతో టీడీపీ పతనం ఓవైపు, టీఆర్ఎస్ ప్రభంజనం మరోవైపు మొదలైంది.
ఒక్కొక్కరుగా గులాబీ దళంలో..
2003లో చేవెళ్ల ఎమ్మెల్యే హోదాలో కేఎస్ రత్నం గులాబీ దళంలో చేరారు. తదనంతరం ఒక్కొక్కరుగా టీఆర్ఎస్లో చేరడంతో బలమైన పార్టీగా తయారైంది. 2011లో సకల జనుల సమ్మె, టీఆర్ఎస్ పదవీ త్యాగం చేశారు. కానీ టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవులను వదులుకోలేదు. ఉద్యమం జోరందుకోవడంతో జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్, టీడీపీ నేతలకు వణుకు పుట్టింది. వారు నియోజకవర్గాల్లో తిరగలేకపోయారు. ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్రసర్కారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది. దీంతో ఈ క్రెడిట్ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్కు, ఆ పార్టీ అధినేత కేసీఆర్కు దక్కింది.
2014 ఎన్నికలకు ముందు..
2014 ఎన్నికలకు ముందు తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ గాలి వీచింది. తెలంగాణను తెచ్చింది.. ఇచ్చింది తామేనని టీ కాంగ్రెస్ నేతలు చెప్పుకున్నా ప్రజలు వారిని నమ్మలేదు. తెలంగాణలో జరిగిన తొలి ఎన్నికల్లో జిల్లాలోని అర్బన్ నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. మిగతా పార్టీల ఎమ్మెల్యేలు కూడా సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయభేరి కొనసాగింది. జిల్లాలోని మెజార్టీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలువగా, మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి సుధీర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా గెలుపొందగా, అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటగా చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డి గెలుపొందారు. వరుసగా జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, డీసీసీబీ ఎన్నికల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది.
భవిష్యత్తంతా టీఆర్ఎస్దే..
ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దే..
పరిగి, అక్టోబర్ 28 : టీఆర్ఎస్ ఏర్పడి 20 ఏండ్లు పూర్తి కాగా వికారాబాద్ జిల్లా పరిధిలో 2004లోనే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకొని బోణీ చేసిన టీఆర్ఎస్ విజయయాత్ర అప్రతిహతంగా కొనసాగుతున్నది. నూతనంగా ఏర్పడిన జిల్లా పరిషత్ను సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిధిలో మెజార్టీ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్వారే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా చెప్పుకుంటున్న జాతీయ పార్టీలకు వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ప్రజాప్రతినిధులు ఉండడం గమనార్హం. గ్రామస్థాయి నుంచి మొదలుకొని జిల్లాస్థాయి వరకు అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్వే..
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా పరిధిలోని తాండూరు ఎమ్మెల్యేగా పట్నం మహేందర్రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యేగా సంజీవరావు టీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో వికారాబాద్ ఎమ్మెల్యేగా మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యేగా కొప్పుల మహేశ్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థులుగా విజయపరంపర కొనసాగించారు. తాండూరు నుంచి గెలుపొందిన పైలెట్ రోహిత్రెడ్డి టీఆర్ఎస్లో చేరడంతో ప్రస్తుతం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు పార్లమెంటు ఎన్నికలు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. ఎమ్మెల్సీగా పట్నం మహేందర్రెడ్డి విజయం సాధించారు.
జడ్పీ, నాలుగు మున్సిపాలిటీలు కైవసం
వికారాబాద్ జిల్లా ఏర్పాటు తర్వాత మొదటిసారి జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జడ్పీని కైవసం చేసుకుంది. జిల్లా పరిధిలో 18 మండలాలకు ఎన్నికలు జరుగగా ప్రస్తుతం 15 మంది జడ్పీటీసీలు, 15 మంది ఎంపీపీలు టీఆర్ఎస్వారు కొనసాగుతున్నారు. జడ్పీ చైర్పర్సన్గా సునీతారెడ్డి ఎన్నికయ్యారు. 203 ఎంపీటీసీ స్థానాల్లో మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జిల్లాలోని అన్ని మున్సిపల్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. సర్పంచ్ స్థానాల్లో 80 నుంచి 90 శాతం వరకు టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు జిల్లా పరిధిలో 18 ఉండగా 17 పీఏసీఎస్ చైర్మన్లు టీఆర్ఎస్ మద్దతుదారులే గెలుపొందారు.