పారిశ్రామిక రంగానికి రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. ఆసక్తి కనబరుస్తున్న కంపెనీలకు సకల సౌకర్యాలనూ కల్పిస్తున్నది. సమీపంలో ఎయిర్పోర్టు ఉండడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమల యాజమాన్యాలు ముందుకొస్తున్నాయి. ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో చందనవెళ్లిలో 1800 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి, రూ. 8వేల కోట్లతో వివిధ రకాల పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు చేపట్టారు. టెక్స్టైల్స్, అమెజాన్, కటేరా, కుందనా తదితర కంపెనీలు ఇప్పటికే ఏర్పాటు కాగా, శంకర్పల్లి మండలం కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. షాబాద్ మండలం సీతారాంపూర్లో ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ నిర్మితమవుతున్నది. రంగారెడ్డి జిల్లా పరిశ్రమల హబ్గా మారుతుండడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయి.
షాబాద్, అక్టోబర్ 26 : హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డిజిల్లా పరిశ్రమల ఖిల్లాగా మారింది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అత్యధికంగా ఉండడంతో పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. గత పాలకుల హయాంలో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఐటీ మంత్రి కేటీఆర్ సహకారంతో మొదటగా రంగారెడ్డిజిల్లాలోని షాబాద్ మండలం చందనవెళ్లిలో 1800 ఎకరాల ప్రభుత్వ భూమిలో రూ.8వేల కోట్లతో వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మూడేళ్ల క్రితం ఇక్కడి భూములను రైతుల నుంచి సేకరించి ప్రభుత్వం కంపెనీలకు అప్పగించింది. ప్రస్తుతం చందనవెళ్లి, హైతాబాద్, మాచన్పల్లి గ్రామాల పరిధిలో వెల్స్పన్ గ్రూప్కు సంబంధించిన టెక్స్టైల్స్, అమెజాన్, కటేరా, కుందానా తదితర కంపెనీలు ఏర్పాటు చేశారు. కొన్ని కంపెనీలు నిర్మాణం పూర్తవ్వగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. శంకర్పల్లి మండలం కొండకల్లో రైల్వేకోచ్ నిర్మాణం పనులు చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
పరిశ్రమల హబ్గా..
జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు రంగారెడ్డిజిల్లా అనువైన ప్రాంతం కావడంతో పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు అతి సమీపంలో పరిశ్రమలు ఏర్పాటుకు వివిధ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు స్థలం ఉన్నా గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. 2014 సంవత్సరంలో ఏర్పడిన ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేయడంతో నగరానికి చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డిజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పడం జరిగింది. జిల్లాలోని కొత్తూర్ మండలం సిద్దాపూర్లో కొత్తగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలో ఎమ్మెఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తున్నది. నందిగామ, ఫరూఖ్నగర్ మండలాల్లో నూతన కంపెనీలు ఏర్పాటు కానున్నాయి.
సీతారాంపూర్లో ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ
షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలోని దేవాదాయ భూముల్లో ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి సంబంధించిన 1148 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిలో గతంలో ఉన్న ప్రభుత్వాలు కంపెనీలు ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారే తప్ప, అమలుకు నోచుకోలేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చేపట్టి ఈ దేవాదాయ భూములను టీఎస్ఐఐసీకి అప్పగించింది. ముంబాయి-బెంగళూరు లింకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఈ భూముల్లో ఎలక్ట్రికల్ కార్ల కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంపెనీలు ఏర్పాటు అవుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.