అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను అమలులోకి తీసుకొచ్చింది. ధరణితో సమయం ఆదా కావడంతో పాటు అవినీతి, అక్రమాలకు చెక్ పడింది. మీ-సేవకు వెళ్లి స్లాట్ బుక్ చేసుకున్న 24 గంటల్లో భూ రిజిస్ట్రేషన్ కావడంతో పాటు పట్టాదారు పాసుపుస్తకాన్ని అందజేస్తున్నారు. అయితే దరఖాస్తుల్లో కొన్ని సమస్యలు నెలకొనడంతో వాటిని సత్వరమే పరిష్కరించేందుకు రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తున్నది. ఇప్పటికే జిల్లాలో 98 శాతం దరఖాస్తులను పరిష్కరించి, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా 79,166 దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 72,895 దరఖాస్తులను పరిష్కరించారు. భూ పత్రాలు సరిగ్గా ఉన్నవాటికి ఆమోదం తెలుపగా, మిగిలిన దరఖాస్తులను తిరస్కరించారు. ఇక పెండింగ్లో ఉన్న 6271 దరఖాస్తులను రేపటిలోగా క్లియర్ చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలను ముమ్మరం చేసింది.
రంగారెడ్డి, అక్టోబర్ 26, (నమస్తే తెలంగాణ) : ధరణి సమస్యల సత్వర పరిష్కారానికి కలెక్టర్ అమయ్కుమార్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ నెల 28లోగా ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ధరణి స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారంలోగా పెండింగ్ దరఖాస్తులన్నింటికి పరిష్కారం చూపనున్నారు. ఇందుకుగాను రోజుకు పది మండలాల చొప్పున పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు నిర్ణయించారు. మంగళవారం మహేశ్వరం, కందుకూరు మండలాలతోపాటు షాద్నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఫరూఖ్నగర్, నందిగామ, కొత్తూరు, కేశంపేట, చౌదరిగూడ మండలాలకు సంబంధించి ధరణి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించారు. సంబంధిత మండలాల తహసీల్దార్లతో కలెక్టరేట్లో సమావేశమై పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి రికార్డులను పరిశీలించి వెంటనే డీఆర్వో, జేసీ, కలెక్టర్ ఆమోదం తెలుపుతున్నారు. అయితే సంబంధిత దరఖాస్తులకు సంబంధించి భూపత్రాలు సరిగ్గా లేనట్లయితే తిరస్కరించడం, అన్ని సరిగ్గా ఉన్నట్లయితే వెంటనే ఆమోదం తెలుపుతున్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా నేడు మరో పది మండలాలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించనున్నారు.
రాష్ట్రంలోనే నెంబర్ వన్
ధరణి దరఖాస్తుల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన ధరణి దరఖాస్తుల్లో 98 శాతం దరఖాస్తులను కలెక్టర్ అమయ్కుమార్ పరిష్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికీ ధరణి దరఖాస్తులకు సంబంధించి ఒక్కటి కూడా పెండింగ్లో ఉండకుండా చూస్తున్నారు. అదేవిధంగా మ్యుటేషన్స్, సక్సేషన్స్కు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలుపుతున్నారు. ప్రతీరోజు 600 దరఖాస్తుల వరకు క్లియర్ చేస్తున్నారు.
ధరణితో రైతులకు పారదర్శక సేవలు
రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ద్వారా రైతులకు పారదర్శకంగా సేవలందుతున్నాయి. ధరణి పోర్టల్తో డబ్బుతోపాటు సమయం కూడా ఆదా అవుతున్నది. ఆయా ప్రాంతాలను బట్టి పోర్టల్లోనే స్టాంప్ డ్యూటీ ధరలు చూపిస్తుండడంతో డాక్యుమెంట్ రైటర్స్ కానీ, మీ సేవా నిర్వాహకులుగాని అధికంగా డబ్బులు వసూలు చేసేందుకు వీలు లేదు. గతంలో మాదిరిగా మారుమూల గ్రామం నుంచి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సేషన్, పార్టిషన్ సేవలకై పట్టణాలకు రావాల్సిన అవసరం లేకుండా మండల కేంద్రాల్లోనే సేవలు అందుబాటులోకి వచ్చిన దృష్ట్యా రోజుల తరబడి తిరగాల్సిన పనిలేకుండా త్వరగా పూర్తవుతున్నది. అంతేకాకుండా ధరణి పోర్టల్తో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది. గతంలో డబుల్ రిజిస్ట్రేషన్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు నూతన విధానంతో రైతులకు డబుల్ రిజిస్ట్రేషన్ల నుంచి విముక్తి కలిగింది. మరోవైపు ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సీఎం కేసీఆర్ ఆదేశాలతో భూములకు సంబంధించి పెండింగ్ దస్ర్తాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు.
గతంలో వారసత్వంగా వచ్చే భూములను వారసుల పేరిట మార్చేందుకు రైతులు ఏండ్ల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. గతంలో 45 రోజుల్లో పూర్తి చేయాల్సిన వారసత్వ రిజిస్ట్రేషన్ సంవత్సరాలు గడిచినా పూర్తయ్యేది కాదు. సంబంధిత రెవెన్యూ అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పితేగాని పని అయ్యేది. కొందరు అధికారులైతే లంచం తీసుకున్నప్పటికీ సదరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు ముప్పుతిప్పలు పెట్టేవారు. అంతేకాకుండా వీఆర్వో స్థాయి నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీవో వరకు లంచం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొని ఉండేది.
ప్రస్తుతం రైతులకు ఈ బాధలన్నీ తప్పాయి. ప్రస్తుతం వారసత్వ రిజిస్ట్రేషన్కై పట్టాదారు పాసు పుస్తకం, పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల అంగీకార పత్రం, ఇద్దరు సాక్షుల ఆధార్ కార్డులతో మీ సేవలో స్లాట్ బుక్ చేసిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్కు పూర్తి కావడంతోపాటు కుటుంబ సభ్యుల పేరిట కొత్త పట్టాదారు పాసు పుస్తకం జారీ కావడంతోపాటు ఒరిజినల్ పట్టాదారు పాసు పుస్తకం నేరుగా రైతుల ఇంటికే అందిస్తున్నారు. స్లాట్ బుకింగ్ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ధరణి పోర్టల్ ద్వారానే ప్రక్రియ జరుగుతుండడంతో అవినీతికి ఆస్కారం లేకుండా పోయింది.
ధరణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం
జిల్లాలో ధరణి దరఖాస్తులను సత్వరంగా పరిష్కారం చూపేందుకుగాను చర్యలు చేపట్టాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28లోగా పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేస్తాం. నా లాగిన్కు వచ్చిన ఏ ఒక్క మ్యుటేషన్, సక్సేషన్ దస్ర్తాన్ని కూడా పెండింగ్లో ఉండకుండా చూస్తున్నా. ధరణి పోర్టల్తో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పారదర్శక సేవలు అందుతున్నాయి.