రంగారెడ్డి/పరిగి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : నవంబర్ 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభను విజయవంతం చేసేందుకుగాను టీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశమైన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈమేరకు జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి ఒక్కో బస్సు తరలివెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. విజయగర్జన సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయి సమావేశాలను నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం మంగళవారం పూర్తికాగా, మహేశ్వరం, చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు నేడు నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్లో రెడ్డి బసిరెడ్డి గార్డెన్లో బుధవారం నిర్వహించే సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యుడు యెన్నెం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, తాండూరులోని జీపీఆర్ గార్డెన్స్లో జరిగే సమావేశానికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి, పరిగిలోని బృందావన్ గార్డెన్లో జరిగే సమావేశానికి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, వికారాబాద్లో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ హాజరవుతారు. విజయ గర్జన విజయవంతం కోసం ప్రతీ కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని దిశా నిర్దేశం చేయనున్నారు.