యాచారం, సెప్టెంబర్ 14 : ‘పల్లె ప్రగతి’తో నల్లవెల్లి గ్రామానికి అన్ని మౌలిక వసతులు సమకూరాయి. సర్పంచ్ డేరంగుల రాజు ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించి ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, కంపోస్టుయార్డు, నర్సరీ, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, మిషన్భగీరథ నీరు, విద్యుత్, విద్య, వైద్యం తదితర మౌలిక వసతులు కల్పించారు. అనుబంధంగా ఉన్న నల్లవెల్లి తండాలోని సమస్యలనూ పరిష్కరించారు.
ప్రగతి సూపర్..
నల్లవెల్లి గ్రామ జనాభా 4,000 ఉండగా, 760 ఇండ్లు ఉన్నాయి. అనుబంధ తండాలో 95 ఇండ్లు ఉన్నాయి. గ్రామంలో మూడు, తండాలో ఒక వాటర్ ట్యాంకులున్నాయి. రూ.11లక్షలతో 3 కాలనీల్లో సీసీ రోడ్లు వేశారు. సుమారు రూ.50లక్షలతో భూగర్భ డ్రైనేజీలను నిర్మించారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను కూల్చివేయగా, పురాతన బావులను పూడ్చివేశారు. రూ.7.5లక్షలతో ట్రాక్టర్, రూ.1.6లక్షలతో ట్రాలీ, రూ.1.6లోలతో ట్యాంకర్ కొనుగోలు చేశారు. ప్రతి వీధిలో ఎల్ఈడీ లైట్లను వేయగా, రాత్రి వేళల్లో జిగేల్మంటున్నాయి. గ్రామ రోడ్లకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటారు. ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. పల్లె ప్రకృతి వనంలో సీతాఫలం, బాదం, చింత, మామిడి, అల్లనేరేడు తదితర పండ్లు, పూల మొక్కలను నాటి సంరక్షిస్తుండటంతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. ఉదయం గ్రామస్తుల కోసం వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేశారు. రూ.12.5లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు.
గ్రామమంతా పరిశుభ్రం…
రూ. 1.45లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించారు. నిత్యం ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్తో వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. వీధుల్లోని పెంటకుప్పలు, చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, కోళ్ల వ్యర్థాలను తొలగించారు.
గ్రామానికి రాములోరి రక్ష..
నల్లవెల్లి గ్రామ పరిధిలో సీతారామచంద్ర స్వామి దేవాలయం పురాతన గుట్టపై ఉంది. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సీతా రామచంద్రస్వామి, శివలింగం, ఆంజనేయస్వామిలను భక్తులు దర్శించుకుంటారు. గుట్టపైన సామూహిక వ్రతాలు నిర్వహిస్తారు. గుట్టకింద వన భోజనాలు చేసుకొని సంతోషంగా గడుపుతారు. గ్రామానికి శ్రీరాముడే అన్ని విధాలుగా రక్షణ కవచంగా నిలుస్తాడని ప్రతీతి.
గ్రామాభివృద్ధికి కృషి చేస్తా…
పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం, మిషన్భగీరథతో ఇంటింటికీ నల్లా తదితర పనులను పూర్తి చేశాం.
గ్రామ స్వరూపం మారింది…
‘పల్లె ప్రగతి’తో గ్రామ స్వరూపం మారింది. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇంటింటికీ నల్లా తదితర అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సర్పంచ్ అధ్యక్షతన గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం.
గ్రామం అభివృద్ధి చెందుతున్నది…
ఒకప్పుడు సమస్యలతో సతమతమైన గ్రామం.. నేడు ‘పల్లె ప్రగతి’తో అభివృద్ధి చెందుతున్నది. అన్ని మౌలిక వసతులు సమకూరి, ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామ పాలకులు గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగాలి.