వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 2న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ…‘అహాన్ని విడిచిపెట్టే ఏ బంధమైనా రంగరంగ వైభవంగా ఉంటుంది అని చెప్పడమే ఈ సినిమా ఉద్దేశ్యం.
ట్రైలర్లో ఎలాంటి ఎనర్జీని చూశారో, సినిమా మొత్తం అంతే ఉత్సాహంగా సాగుతుంది. సినిమా చూసి బయటకొచ్చేప్పుడు చాలా సంతోషంగా వస్తారు’ అని చెప్పారు. నాయిక కేతిక శర్మ మాట్లాడుతూ..‘పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఈ చిత్రంలో రాధ పాత్రలో మిమ్మల్ని ఆకట్టుకుంటాను. హీరోకు నేనంటే ఇష్టమున్నా అహం అడ్డొచ్చి దూరంగా ఉంటాడు. వీళ్ల ప్రేమను తెరపై చూడండి’ అని చెప్పింది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ…‘కుటుంబమంతా కలిసి చూసేలా మా సినిమా ఉంటుంది. వైష్ణవ్ తేజ్, కేతిక జంటను మీరంతా ఇష్టపడతారు’ అని అన్నారు.