అనతికాలంలోనే గీత రచయితగా తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రను వేశారు శ్రీమణి. అర్థవంతమైన సాహిత్యం, విభిన్నశైలి భావ వ్యక్తీకరణతో ప్రేక్షకుల మెప్పుపొందారు. ఆయన సినీరంగంలోకి ప్రవేశించి పదేళ్లు పూర్తవుతోంది. నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘రంగ్దే’ చిత్రంలో శ్రీమణి నాలుగుపాటల్ని రాశారు. దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా శ్రీమణి మాట్లాడుతూ “తొలిప్రేమ’ నుంచి దర్శకుడు వెంకీతో కలిసి పనిచేస్తున్నా. ఆయన పాట కోసం మంచి సందర్భాల్ని సృష్టిస్తారు. ‘రంగ్దే’ సినిమాలోని అన్ని పాటలకు చక్కటి సందర్భాలు కుదిరాయి. నాలుగు పాటలు వేటికవే భిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. గీత రచయితగా ప్రతి పాటను ఓ సవాలుగా తీసుకుంటా. ఇప్పటికే ఎన్నో ప్రేమ పాటలొచ్చాయి. వాటన్నింటి కంటే భిన్నంగా పాటలు రాయాలని తపిస్తాను. ‘రంగ్దే’లో రాసిన పాటలన్నీ అలాంటివే. సినిమా పాటను సమిష్టి కృషికి ఫలితంగా చెప్పొచ్చు. సాహిత్యం, స్వరం, గాత్రం అన్నీ కలిస్తేనే మంచి పాట పుడుతుంది. పాట సంపాదించే ఘనతలో అందరి క్రెడిట్ ఉంటుంది. ‘జులాయి’ సినిమాతో గీత రచయితగా నాకు కమర్షియల్ బ్రేక్ దొరికింది. అప్పటి నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్తో నా అనుబంధం మొదలైంది. ప్రేమకథా చిత్రాలకు పాటలు ప్రజాదరణ పొందితే సినిమా విజయానికి అవి ఎంతగానో దోహదపడతాయి’ అన్నారు.