న్యూఢిల్లీ: రాందేవ్ బాబా పతంజలి ఆయుర్వేద కంపెనీ పాడి విభాగం ఇంచార్జీగా పనిచేస్తున్న సునీల్ బన్సల్ (57) కరోనాతో కన్నుమూశారు. అయితే ఆయన తీసుకున్న అల్లోపతి చికిత్సతో తమకు సంబంధం లేదని కంపెనీ పేర్కొనడం విశేషం. రాందేవ్ బాబా అల్లోపతిపై విమర్శలు చేయడం వివాదాస్పదమైంది. అల్లోపతి చికిత్స వల్లే లక్షల మంది కరోనాతో మరణిస్తున్నారని బాబా ఒక వీడియోలో పేర్కొనడంపై దుమారం రేగింది. కొన్ని మందుల పేర్లు కూడా ఆయన అందులో ప్రస్తావించారు. గత ఆదివారం ఆయన క్షమాపణలు చెప్పి ఆ ప్రకటనను వెనుకకు తీసుకున్నారనేది వేరే విషయం. ఆయనకు చెందిన పతంజలి కంపెనీ కరోనా మందును కోరోనిల్ పేరుతో అమ్ముతున్నది. హర్యానా సర్కారు లక్ష డోసులు ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో బన్సల్ మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆవుపాలు, పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని బన్సల్ చూసుకునేవారు. ఆయన రాజస్థాన్ లోని ఓ హాస్పిటల్ లో కరోనాకు చికిత్స పొందుతూ ఈనెల 19వ తేదీ మరణించారు. రాజస్థాన్లో ఆయన భార్య సీనియర్ వైద్యాధికారిగా ఉన్నారు.