ముంబై : మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై బీజేపీ వేచిచూసే ధోరణి అవలంభిస్తుండగా కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రాందాస్ అథవలే శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. రెబెల్ నేత ఏక్నాథ్ షిండేకు 37 మంది శివసేన ఎమ్మెల్యేలు, ఏడెనిమిది మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతిస్తుండగా తాము మెజారిటీ నిరూపించుకుంటామని ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, అజిత్ పవార్, సంజయ్ రౌత్ ఎలా చెబుతారని ప్రశ్నించారు.
ఎంవీఏ సర్కార్ సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. రాందాస్ అథవలే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఠాక్రే, ఏక్నాథ్ షిండేలు తమ మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించుకోవాలని అన్నారు. సేన కార్యకర్తలు రెబెల్ ఎమ్మెల్యేలను బెదిరించడం మానుకోవాలని హితవు పలికారు.
సేన కార్యకర్తలు దాదాగిరి చేస్తే తాము దీటుగా బదులిస్తామని కేంద్ర మంత్రి హెచ్చరించారు. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుకోవడం లేదని అన్నారు. శివసేన అంతర్గత వివాదంలో తాము చేసేదేమీ లేదని దేవేంద్ర ఫడ్నవీస్ తనతో అన్నారని కేంద్ర మంత్రి చెప్పారు.