“నాట్యం’ సినిమా చూశాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సన్నివేశం అత్యద్భుతంగా ఉంది. నృత్యం, డ్రామా, సంభాషణలతో పాటు ప్రతి అంశం బాగుంది’ అని అన్నారు రామ్చరణ్. శనివారం హైదరాబాద్లో జరిగిన ‘నాట్యం’ ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఈ నెల 22న విడుదలకానుంది. ప్రీ రిలీజ్ వేడుకలో రామ్చరణ్ మాట్లాడుతూ ‘తెలుగు చిత్రసీమలో పూర్వవైభవం దిశగా అడుగులు పడుతుండటం ఆనందంగా ఉంది. కూచిపూడి నాట్యం ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ గొప్పగా సంధ్యారాజు ఈ సినిమాను తెరకెక్కించారు. స్త్రీశక్తిని చాటిచెప్పే చిత్రమిది. సంకల్పం బలంగా ఉంటే లక్ష్యాల్ని చేరుకోవడం కష్టం కాదని ఈ సినిమాతో నిరూపించారు’ అని తెలిపారు. ‘రామ్చరణ్తో పదేళ్లుగా పరిచయముంది. మా సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ఆయన చేసిన సహాయం గొప్పది. సమిష్టి కృషి వల్లే సినిమా పూర్తిచేయగలిగాను’ అని సంధ్యారాజు చెప్పింది. దర్శకుడు రేవంత్ మాట్లాడుతూ ‘తెలుగుదనం ఉన్న సినిమా ఇది. ఇలాంటి విభిన్నమైన చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించినప్పుడే మరిన్ని కొత్త సినిమాలొస్తాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యమీనన్, శ్రవణ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.