ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ సోమవారం విడుదలైంది. అయోధ్యలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో చిత్ర నిర్మాతలు ఈ సినిమా టీజర్ను లాంచ్ చేశారు. లంకేషుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, సీత పాత్రలో కృతి సనన్ నటించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12 న బిగ్ స్క్రీన్పై విడుదల చేయనున్నట్లు సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఆదిపురుష్ టీజర్ విడుదలైన తర్వాత నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఇప్పుడు, రామానంద్ సాగర్ నిర్మించిన రామాయణ్ టీవీ సీరియల్లో సీతగా నటించిన నటి దీపికా చిఖిలియా ఆదిపురుష్ టీజర్పై తన స్పందనను వెల్లడించింది.
‘నేను ఆదిపురుష్ సినిమా టీజర్ చూశాను. రామాయణం నిజాయితీ, సాత్వికతకు సంబంధించిన కథ. నా వ్యక్తిగత అభిప్రాయం మేరకు రామాయణాన్ని వీఎఫ్ఎక్స్లో తీసుకురావడం బాగోలేదు. హనుమంత పాత్రధారి తోలు వస్త్రం కప్పుకున్నట్లు చూపారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, అది టీజర్లో నాకు అంత క్లియర్గా కనిపించలేదు. వాల్మికీ, తులసీదాస్ రాసిన రామాయణ కథలను సత్యం అని అనుకుంటున్నాను. అవి మన దేశ వారసత్వ సంపద కాబట్టి అలాగే మెయింటేన్ చేయాలి అని భావిస్తున్నాను’ అని దీపికా చిఖిలియా వ్యాఖ్యానించింది.
ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ఓం రౌత్, క్రిషన్ కుమార్, రాజేష్ మోహనన్ నిర్మించారు. సన్నీ సింగ్ కూడా నటించిన ఈ చిత్రం ఐమాక్స్ 3డీ ఫార్మాట్లో వెండితెరపై ప్రదర్శించనున్నది.