ములుగు, అక్టోబర్ 21(నమస్తేతెలంగాణ)/వెంకటాపూర్/హనుమకొండ చౌరస్తా/ఖిలావరంగల్: సీఎం కేసీఆర్ కృషితోనే రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. అతి ప్రాచీన కట్టడమైన రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయాన్ని, హనుమకొండలోని వేయిస్తంభాల గుడిని, వరంగల్లోని చారిత్రక కోటను కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి గురువారం ఆయన సందర్శించారు. ములుగులో యునెస్కో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయాచోట్ల మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో నిరాదరణకు గురైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు స్వరాష్ట్రంలోనే గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. గత పాలకులు చారిత్రక నిర్మాణాలపై పూర్తి నిర్లక్ష్యం చేశారని, నేడు వాటికి సీఎం కేసీఆర్ వన్నె తెస్తున్నారని కొనియాడారు. యునెస్కో గుర్తింపు కోసం 20 ఏండ్లుగా కృషి చేసిన కాకతీయ హెరిటేజ్ సభ్యులు, నిట్ ప్రొఫెసర్ పాండురంగారావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాపారావుల కృషి మరువలేనిదని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, కలెక్టర్లు కృష్ణ ఆదిత్య, బీ గోపి, ఎస్పీ సంగ్రామ్సింగ్ జీ పాటిల్, తదితరులు ఉన్నారు.