హైదరాబాద్ : వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సమతామూర్తి పేరిట భగవత్ రామామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. సోమవారం ఆయన ముచ్చింతల్లోని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇవాళ్టి నుంచి ఆశ్రయంలో చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 1017లో రామానుజాచార్యులు అవతరించి 121 ఏళ్లపాటు భూమిపై ఉన్నారు. ఆయన సమతాస్ఫూర్తిని ఎంతో మంది మేధావులు అంగీకరించారు. చిన్న వయసులోనే ఆయనలో అద్భుత ప్రతిభాపాటవాలు ఉండేవన్నారు.
రామానుజాచార్యులు కేవలం పండితులే కాదు.. అద్భుతమైన ప్రజ్ఞాశాలి అని, సమతా సిద్ధాంతాన్ని లోకానికి చాటిన మహనీయులన్నారు. రామానుజుల సమతా స్ఫూర్తిని నేటి సమాజాన్ని అవసరమని, ఈ మేరకు శ్రీరామనగరంలో రామానుజుల భారీ విగ్రహాన్ని నిర్మించినట్లు చెప్పారు. సహస్రాబ్ది వేడుకల్లో రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పంచలోహ విగ్రహం నిర్మాణమని, విగ్రహ నిర్మాణానికి రూ.1200కోట్లకుపైగా ఖర్చయిందని చెప్పారు. 120 కిలోల బంగారంతో నిత్యారాధన విగ్రహం ఏర్పాటు చేశామని వివరించారు.