హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తేతెలంగాణ): సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రామ్గోపాల్వర్మ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్సుకోవాలని గురువారం ట్విట్టర్ ద్వారా సూచించారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే అక్కడి రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రయుద్ధం లాంటి విద్యలను నేర్చుకోవాల్సి ఉన్నదని ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంతో పలు ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం టీడీపీ బంద్ నిర్వహించింది. టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం 36 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.