పట్నా : బిహార్లో రైతుల పరిస్ధితి దయనీయంగా ఉందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్ధితి దాపురించిందని అన్నారు. ఈ పరిస్ధితులు మారేందుకు అక్టోబర్ నుంచి డిమాండ్ల సాధన దిశగా రైతులు భారీ ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు.
పంటలకు గిట్టుబాటు ధరలు లభిస్తే రైతులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళతారని ప్రశ్నించారు. రైతాంగ సమస్యలపై చర్చించేందుకు అవసరమైతే సీఎం నితీష్ కుమార్తో చర్చిస్తానని చెప్పారు. కార్మికులకు సైతం సొంత రాష్ట్రంలోనే ఉపాధి దొరికితే జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే అవసరం ఏముంటుందని తికాయత్ ప్రశ్నించారు.
బిహార్ రైతులు తమ హక్కులను సాధించుకునేందుకు ముందుకు రావాలని, డిమాండ్ల సాధనకు గళమెత్తాలని పిలుపు ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి బిహార్లో రైతాంగ ఉద్యమ ప్రచారానికి తాను వస్తానని చెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో బిహార్ రైతులు చురుకుగా వ్యవహరించారని అన్నారు.