న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తనకు నష్టం కాబోదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. బీజేపీ విజయం భారతీయ కిసాన్ యూనియన్కు నష్టం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. తాము రాజకీయ నేతలం కాదని, తాము మార్పును కోరేవారమని, సామాజిక కార్యకర్తలమని ఆయన పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు లాభం కాదు..నష్టం కూడా కాదని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన సుదీర్ఘ పోరాటాన్ని మోదీ సర్కార్ విస్మరించడంతో పశ్చిమ యూపీలో కాషాయ పార్టీకి భంగపాటు తప్పదని గతంలో తికాయత్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆయన అంచనా వేశారు.
పశ్చిమ యూపీ సహా రాష్ట్రవ్యాప్తంగా రైతాంగ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని బీకేయూ సహా పలు రైతు సంఘాల నేతలు, పరిశీలకులు భావించారు. ఇక యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్ధానాలకు గాను బీజేపీ 269 స్ధానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎస్పీ 129 స్ధానాల్లో, బీఎస్పీ 1 స్ధానంలో కాంగ్రెస్ 2 స్ధానాల్లో ఇతరులు 2 స్ధానాల్లో ముందంజలో ఉన్నాయి.పంజాబ్లో ఆప్ ఘనవిజయం సాధించగా, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్లో బీజేపీ అధికారం నిలుపుకుంది.