న్యూఢిల్లీ : బీకేయూ నేత రాకేష్ తికాయత్ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లఖింపూర్ ఖేరీలో బీజేపీ కార్యకర్తలపై మూకదాడిని తాను హత్యలుగా పరిగణించనని ఆయన వ్యాఖ్యానించారు. ఇది చర్యకు ప్రతీకారంగా జరిగిన ప్రతిచర్యగా ఆయన అభివర్ణించారు. లఖింపూర్ ఖేరిలో నిరసనకు దిగిన రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు చెందిన వాహనంగా భావిస్తున్న ఎస్యూవీ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన నేపధ్యంలో ఆగ్రహంతో ఊగిపోయిన రైతుల దాడిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు మరణించారు.
రైతులపై కార్ల కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు రైతులు మరణించిన తర్వాత దానికి ప్రతిగా రైతులు స్పందించారని, బీజేపీ కార్యకర్తలను చావబాదిన వారిని తాను దోషులుగా చూడనని రాకేష్ తికాయత్ స్పష్టం చేశారు. రోడ్డుపై రెండు వాహనాలు ఢీ కొంటే వారు ఘర్షణకు తలపడుతుండటం మీరు చూస్తుంటారు..లఖింపూర్ ఖేరిలో జరిగింది కూడా అదేనని ఆయన చెప్పుకొచ్చారు.