ఎరువులు, బియ్యం, ఇతర ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ సిద్ధమైంది. నేడు మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి కార్యక్రమానికి హాజరై ప్రారంభించనుండగా, మెతుకు సీమకు గూడ్స్ బండి రానుండడంతో ప్రజలు, రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైలు సౌకర్యంతో ఇక్కడి నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం మెదక్ నుంచి రైల్వేలైన్లను ఎఫ్సీఐ గోదాములతో అనుసంధానించనున్నారు. దీంతో శరవేగంగా వ్యాపార, పారిశ్రామికాభివృద్ధి జరగనున్నది. ఇప్పటికే స్థానిక మార్కెట్ యార్డులో 1000 టన్నుల ఎరువులను నిల్వ చేసే గోదాంలు అందుబాటులో ఉన్నాయి. అక్కన్నపేట-మెదక్కు రూ.205 కోట్లతో 17.2 కిలోమీటర్ల పొడవునా రైల్వేలైన్ను ఏర్పాటు చేయగా, రైల్వే శాఖతో పాటు మార్కెటింగ్, ఎఫ్సీఐ అధికారులతో మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేశారు.
మెదక్, జూలై 31 (నమస్తే తెలంగాణ): వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధితో మెతుకు సీమకు మహర్దశ రానున్నది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఎరువుల రాకపోకల నిర్వహణ కోసం మెదక్లో రేక్ పాయింట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన విషయం తెలిసిందే. మెదక్లో రైల్వే రేక్ పాయింట్ రాకతో ఈ ప్రాంత ప్రజలు, వ్యాపారులు, రైతులకు ఎంతో ప్రయోజం ఉంటుంది. మెదక్ నుంచి దేశంలోని ఏ ప్రాంతానికైనా సరుకు రవాణా సులభతరం కానున్నది. కొత్తగా ఏర్పాటైన కొత్తపల్లి- మనోహరాబాద్, మెదక్ రైల్వే లైన్లను భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోదాంలతో అనుసంధానం చేసే అంశంపై మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా సమీక్షించారు. గజ్వేల్లోని గడా కార్యాలయంలో మెదక్ కలెక్టర్, ఎఫ్సీఐ జనరల్ మేనేజర్, మార్కెటింగ్ డైరెక్టర్, రైల్వే అధికారులతో రేక్ పాయింట్ పనులు త్వరగా పూర్తయ్యేలా చొరవ తీసుకున్నారు.
అందుబాటులోకి రైల్వే సౌకర్యం
మెదక్లో రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో మెతుకు సీమ వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధిలో దూసుకుపోనున్నది. మెదక్ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి హోదాలో ఉన్నా ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యం కల్పించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెదక్కు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషిచేశారు. అక్కన్నపేట-మెదక్కు రూ.205 కోట్లతో 17.2 కిలోమీటర్ల పొడువునా రైల్వే లైన్ నిర్మించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.102 కోట్లు మంజూరు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు వెచ్చించింది. రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా మంత్రి హరీశ్రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. రైల్వే శాఖ అధికారులతో పాటు మార్కెటింగ్, ఎఫ్సీఐ అధికారులతో సమావేశం నిర్వహించి అక్కన్నపేట- మెదక్ రైల్వే లైన్ పనులు పూర్తి చేయించారు. మెదక్కు రైళ్లను ప్రారంభించాలని రైల్వే అధికారులను ఆదేశించారు.
నెల రోజుల్లోనే రేక్ పాయింట్ ఏర్పాటు
మెదక్ ప్రాంతానికి రైళ్ల రాక ప్రారంభమైతే ఇక్కడ వ్యాపారాలు, పరిశ్రమలతో పాటు గోదాంలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ముందుగా గూడ్స్ రైలుతో మెదక్ తదితర ప్రాంతాలకు అవసరమైన ఎరువులు, బియ్యం సరఫరా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో మెదక్లో నెల రోజుల వ్యవధిలోనే రేక్ పాయింట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే మెదక్ మార్కెట్ కమిటీ యార్డులో 1000 టన్నుల ఎరువులు నిల్వ చేసే గోదాంలు నిర్మించారు. యేటా 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం తరలించుకోవచ్చు. మెదక్లో రేక్ పాయింట్ ఏర్పాటుతో రైస్ మిల్లర్లకు, ఎరువులు, రసాయనాలు, స్టీల్, సిమెంట్ ఇండస్ట్రీ, పత్తి ఎగుమతికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. లోడింగ్, అన్ లోడింగ్తో స్థానికులకు ఉపాధి లభిస్తుంది. దీంతో రైస్మిల్లర్లు, రైతులు, పారిశ్రామిక వేత్తలకు ఎంతో ఉపయోగపడనున్నది.
సరుకుల రవాణాకు సౌకర్యంగా..
మెదక్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏండ్ల కల నెరవేరనున్నది. మెదక్లో రేక్ పాయింట్ ఏర్పాటుతో జిల్లాలో రైతులు పండించిన ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి, దిగుమతి సులభతరం కానున్నది. ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటు కాగా, మెదక్లోనూ రైల్వే శాఖ అధికారులు సిద్ధంచేశారు. మెదక్ మార్కెట్ కమిటీ యార్డులో ఎరువుల గోదాంలు ఏర్పాటుతో ఇబ్బందులుండవు. మనోహరాబాద్, తూప్రాన్, చేగుంట, రామాయంపేట, చిన్నశంకరంపేట, నర్సాపూర్ ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించాయి. ఈ ప్రాంతాల్లోని కంపెనీల్లో తయారవుతున్న ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో ఎగుమతి చేసుకునే అవకాశం కలగనున్నది.
నేడు రేక్ పాయింట్ ప్రారంభం
మెదక్లో రేక్ పాయింట్ను మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి ప్రారంభించనున్నారు. మెదక్లో రేక్ పాయింట్ ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లా. నెల రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ ఏఎంసీలో వెయ్యి టన్నుల కెపాసిటీ గల తాత్కాలిక గోదాంను ఏర్పాటు చేశాం. రైల్వే లైన్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. – ఎం.పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే
ఏర్పాట్లు పూర్తి
మెదక్లో రైల్వే శాఖ ఆధ్వర్యంలో రేక్ పాయింట్కు ఏర్పాట్లు పూర్తిచేశాం. మూడు రోజులుగా మెదక్ రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ పనులు పరిశీలించాం. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో మెదక్ ఏఎంసీలో వెయ్యి టన్నుల తాత్కాలిక గోదాం ఏర్పాటు చేశాం. రేక్ పాయింట్ రాకతో వ్యాపారులు, రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. లోడింగ్, అన్ లోడింగ్లో ఉపాధి లభించనున్నది.
– ఎస్.హరీశ్, మెదక్ కలెక్టర్
చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం
మెదక్కు రైలు సౌకర్యం రావాలన్నది ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. సీఎం కేసీఆర్ మెదక్ ప్రాంతవాసుల కలను నెరవేర్చారు. ఈ ప్రాంతంలో తయారు చేసిన ఉత్పత్తులను రైలు సౌకర్యంతో ఎగుమతి చేసుకునే అవకాశం ఉంటుంది. ఏఎంసీలో 1000 టన్నుల ఎరువులు నిల్వ చేయడానికి గోదాంలు ఏర్పాటు చేశాం. యేటా 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించుకోవచ్చు.
– బట్టి జగపతి, ఏఎంసీ చైర్మన్, మెదక్