లక్నో : యూపీలో బీఎస్పీకి కొంత పట్టు ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్భర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా గదిలో బీఎస్పీ అభ్యర్ధులను ఖరారు చేశారని, పాలక బీజేపీకి సహకరించేందుకే మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ బరిలో దిగిందని ఆయన ఆరోపించారు. నాగపూర్లో అసత్యాలపై శిక్షణ పొందిన కాషాయ పార్టీ నేతలు అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. బుల్డోజర్ వ్యాఖ్యలు చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్పైనా ఎస్బీఎస్పీ చీఫ్ విరుచుకుపడ్డారు. ఆయన బుల్డోజర్ను యంత్రంపై ఉంచి ఆయన ఇంటికి తిప్పి పంపుతామని దీటుగా బదులిచ్చారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్, బీఎస్పీలను పట్టించుకోవడం లేదని రాజ్భర్ అన్నారు. ఎస్పీ-ఎస్బీఎస్పీ కూటమికి బీఎస్పీ నుంచి ఎలాంటి ముప్పూ లేదని ఆయన స్పష్టం చేశారు. కాషాయ పార్టీకి బీఎస్పీ లోపాయికారీగా సహకరిస్తోందని ఆయన మండిపడ్డారు. మరోవైపు అఖిలేష్ మంగళవారం బలియాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ బీజేపీలో చోటా నేతలు చిన్నపాటి అసత్యాలు చెబుతుంటే బడా నేతలు భారీ అసత్యాలను ప్రచారం చేస్తారని, ఇక ప్రధాని మోదీ అతిభారీ అబద్ధాలను పదేపదే వల్లెవేస్తుంటారని ఆరోపించారు. బలియా ప్రజలు బీజేపీ చేతిలో పలు సందర్భాల్లో మోసపోయారని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందు వారు రైతుల రాబడిని రెట్టింపు చేస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టారని ఆరోపించారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. యూపీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తుండగా. దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటుగా బదులివ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.