న్యూఢిల్లీ: దేశంలో నమోదైన అత్యాచార కేసుల్లో రాజస్థాన్ టాప్లో ఉండగా ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది. మధ్యప్రదేశ్ మూడు, మహారాష్ట్ర నాలుగో స్థానాల్లో ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2020 డేటా ఈ మేరకు పేర్కొంది. ఈ గణాంకాల ప్రకారం గత ఏడాది రాజస్థాన్లో అత్యధికంగా 5,310 రేప్ కేసులు నమోదయ్యాయి. 2,769 అత్యాచార కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో, 2,339 కేసులతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో, 2,061 కేసులతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉన్నాయి. లైంగిక దాడి బాధితుల్లో 4,031 మంది మహిళలు, 1,279 మంది 18 ఏండ్లలోపు బాలికలు ఉన్నారు.
అయితే రాజస్థాన్లో మహిళాలపై నేరాలు 16 శాతం తగ్గాయని ఎన్సీఆర్బీ రిపోర్ట్ పేర్కొంది. 2020లో మహిళాలపై నేరాలకు సంబంధించి 49,385 కేసుల నమోదుతో ఉత్తరప్రదేశ్ టాప్లో ఉండగా, 36,439 కేసులతో పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, 34,535 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో ఉన్నాయి.
మరోవైపు ఎస్సీ నేరాలపరంగా కూడా రాజస్థాన్ టాప్లో ఉన్నది. 2018 నుంచి 2020 వరకు ఈ క్రైమ్ రేటు 57.4 శాతానికి పెరిగింది. ఎస్సీ నేరాలకు సంబంధించి 2018లో 4,607 కేసులు, 2019లో 6,794, 2020లో 7,017 కేసులు నమోదైనట్లు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.
కాగా, రాజస్థాన్లో అత్యాచార కేసులు ఎక్కువగా నమోదైనప్పటికీ అందులో 42 శాతం తప్పుడు ఆరోపణలని దర్యాప్తులో తేలిందని నేర విభాగం ఏడీజీ రవి ప్రకాష్ మెహర్దా తెలిపారు. కేసుల నమోదులో స్వేచ్ఛ కూడా దీనికి కారణమని చెప్పారు. నేరాలు పెరుగడం, పోలీసులు నమోదు చేసే నేరాలు పెరుగడం అన్నవి రెండు వేర్వేరు విషయాలని ఎన్సీఆర్బీలో పేర్కొన్నట్లు గుర్తు చేశారు. అయితే ఈ నివేదిక నేపథ్యంలో రాజస్థాన్లో శాంతి, భద్రతలు లోపించాయని రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది.