జైపూర్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్లో భారీగా విజృంభిస్తున్నది. ముఖ్యంగా యువతపై ప్రభావం చూపుతుందని, పెద్ద సంఖ్యలో యువత ప్రాణాలు కోల్పోతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. త్వరలోనే థర్డ్ వేవ్ ముంపు పొంచి ఉందని, చిన్నారులపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజస్థాన్లో రెండు రోజుల్లో సుమారు 600 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దౌసా, దుంగార్పూర్ జిల్లాలోని 600 మంది చిన్నారులకు అనారోగ్యం పాలవగా.. వారికి కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.
కరోనాతో తండ్రి మృతి.. పిల్లలిద్దరికీ పాజిటివ్
దౌసాలోని సిక్రై సబ్ డివిజన్లోని ఒక గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు కరోనా లాంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇటీవల సదరు బాలికల తండ్రి కరోనా వైరస్ కారణంగా మరణించాడు. తండ్రి మరణం తర్వాత ఆ బాలికలిద్దరూ వైరస్ బారినపడినట్లు భావిస్తున్నారు. అలాగే దౌసాలో మరో రెండేళ్ల చిన్నారికి సైతం వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దౌసాలో ఈ నెల 1 నుంచి 21వ తేదీల మధ్య 18 ఏళ్లలోపు వయసున్న 241 మంది పిల్లలు మాత్రమే కరోనా బారినపడినట్లు ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. మరోవైపు, దుంగార్పూర్లో పిల్లల్లో వైరస్ సంక్రమణ కేసులు వేగంగా పెరిగాయి. దుంగార్పూర్లో ఈ నెల 12 నుంచి 22 తేదీల మధ్య 255 మంది చిన్నారులకు వైరస్ సోకింది.
తల్లిదండ్రులతోనే పిల్లలకు..
తల్లిదండ్రులతోనే పిల్లలు వైరస్ ఇన్ఫెక్షన్కు గురవుతున్నారని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు వారి తల్లిదండ్రుల నుంచే చిన్నారులకు వైరస్ సోకినట్లు తేలింది. అయితే, గత పది రోజుల్లో 250 మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారని మరో అధికారి చెప్పారు. అయితే, దేశంలోని అత్యున్నత పిల్లల హక్కుల సంస్థ అయిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లుగా అంచనా వేసింది. వైరస్ బారి నుంచి పిల్లలను రక్షించేందుకు కేంద్రం, రాష్ట్రాలు తమ సన్నాహాలను వేగవంతం చేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్కు ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్ లేఖ రాశారు. నేషనల్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ (నెట్స్)ను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. నవజాత శిశువులు, పిల్లల కోసం ప్రత్యేకంగా సేవలందించేందుకు, అంబులెన్సులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ఆరోగ్యమంత్రిత్వశాఖను కోరారు.
మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
థర్డ్ వేవ్ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆరోగ్య అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. పిల్లలకు ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలోని పీడియాట్రిషియన్లను ఉద్దేశించి ఆదివారం సీఎం మాట్లాడారు. పిల్లల్లో కరోనా తేలికపాటి, మధ్యస్థ, తీవ్రమైన లక్షణాలను ఎలా గుర్తించాలో శిశు వైద్యులకు సూచించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.