జైపూర్: రాజస్థాన్ ప్రభుత్వం ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన 15 మంది కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది. అదేవిధంగా పాత మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు చేసింది. కీలకమైన హోం, ఆర్థిక, ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖలను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనవద్దే ఉంచుకున్నారు. డాక్టర్ బీడీ కల్లాకు విద్య, కళలు, సాహిత్యం, సాంస్కృతిక శాఖలను అప్పగించారు. శాంతి ధరివాల్కు న్యాయ, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ ఎఫైర్స్ శాఖలను కట్టబెట్టారు.
ఇక పర్సిదిలాల్ మీనాకు వైద్యారోగ్య, ఎక్సైజ్ శాఖలను కేటాయించారు. లాల్చంద్ కటారియాకు వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖలు అప్పగించారు. ప్రమోద్ భయగోపాలన్కు గనులు, పెట్రోలియం శాఖలను కట్టబెట్టారు. అదేవిధంగా ఉదయ్లాల్ అంజనాకు సహకార శాఖ, ప్రతాప్సింగ్ ఖచారియవాస్కు ఆహార, పౌరసరఫరాల శాఖ, సలేహ్ మహ్మద్కు మైనారిటీ ఎఫైర్స్ శాఖ, హేమారామ్ చౌధరికి అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించారు.
మహేంద్రజీత్ సింగ్ మాల్వీయకు జలవనరుల శాఖ, మహేశ్ జోషికి భూగర్భ నీటి శాఖ, రామ్లాల్ జాట్కు రెవెన్యూ శాఖ, రమేశ్ మీనాకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు, విశ్వేంద్రసింగ్కు పర్యాటక, పౌరవిమానయాన శాఖలు, భజన్లాల్ జాతవ్కు పీడబ్ల్యూడీ, తీకా రామ్ జూలీకి సామాజిక న్యాయ శాఖ, గోవింద్రామ్ మేఘ్వాల్కు విపత్తు నిర్వహణ శాఖ, శకుంతల రావత్కు పరిశ్రమల శాఖను కట్టబెట్టారు.