జైపూర్: ఒక వధువు తన పెండ్లికి ముందు తండ్రిని ఒక కోరిక కోరింది. తన కట్నం కోసం ఉంచిన రూ.75 లక్షలను బాలికల వసతి గృహం నిర్మాణానికి వినియోగించాలని చెప్పింది. దానికి ఆమె తండ్రి ఎంతో సంతోషంతో అంగీకరించారు. రాజస్థాన్లోని బార్మర్లో ఈ ఘటన జరిగింది. కిషోర్ సింగ్ కనోడ్ కుమార్తె అంజలి కన్వర్కు ఈ నెల 21న ప్రవీణ్ సింగ్తో వివాహం జరిగింది. అయితే ఈ పెండ్లికి ముందు అంజలి తన తండ్రిని ఒక కోరిక కోరింది. తన కట్నం కోసం ఉంచిన రూ.75 లక్షలతో బాలికల హాస్టల్ను నిర్మించమని చెప్పింది. దానికి ఆమె తండ్రి ఎంతో సంతోషించారు. కుమార్తె కోరినట్లుగానే చేస్తానని కిషోర్ సింగ్ కనోడ్ హామీ ఇచ్చారు.
వివాహ వేడుకల అనంతరం నవ వధువు అంజలి, తారాతర మఠాధిపతి మహంత్ ప్రతాప్ పూరిని కలిశారు. బాలికల హాస్టల్ నిర్మాణంపై తన కోరికను లేఖ ద్వారా వ్యక్తం చేశారు. అతిథులు హాజరైన ఆ కార్యక్రమంలో ఆమె లేఖను చదివి వినించారు. దీంతో అక్కడి వారంతా చప్పట్లతో అంజలిని అభినందించారు. అక్కడే ఉన్న తండ్రి కిషోర్ సింగ్ కనోడ్, తన కుమార్తెకు బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఆమె కొరుకునే మొత్తం అందులో రాయమని చెప్పారు. అంజలి ఆ మేరకు చెక్ రాసి మహంత్కు అందజేశారు.
కాగా, బాలికల విద్య, వారి వసతి కోసం అంజలి చూపిన చొరవను మహంత్ ప్రతాప్ పూరి ప్రశంసించారు. సమాజాభివృద్ధి కోసం డబ్బును కేటాయించడం, కన్యాదాన్ సమయంలో బాలికల విద్య గురించి ఆమె మాట్లాడటం ఒక స్ఫూర్తిదాయకమైన చర్య అని కొనియాడారు.
మరోవైపు అంజలి తండ్రి కిషోర్ సింగ్ ఇప్పటికే ఎన్హెచ్68లో హాస్టల్ నిర్మాణానికి కోటి గ్రాంట్ ఇచ్చారని మహంత్ ప్రతాప్ పూరి తెలిపారు. అయితే హాస్టల్ నిర్మాణం పూర్తి కావడానికి రూ.50-75 లక్షల వరకు అదనపు నిధులు అవసరమని చెప్పారు. ఈ నిధులు సమకూర్చిన కిషోర్ సింగ్ కుమార్తె అంజలికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నవ వధువు అంజలి చొరవకు సంబంధించిన వార్తా కథనం క్లిప్పింగ్ను బార్మర్ రావత్ త్రిభువన్ సింగ్ రాథోడ్ ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు వ్లెలువెత్తాయి.