రాజన్న సిరిసిల్ల : ఆమె నిండు గర్భిణి. నెలలు నిండాయి. రేపో మాపో ప్రసవం అయ్యే అవకాశం ఉందనుకున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడ్డారు. కొవిడ్ సోకిన రెండు రోజులకే ఆ గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి. గర్భిణి కరోనా బారిన పడినప్పటికీ.. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఆమెకు పురుడు పోశారు. ఆమెకు సాధారణ ప్రసవం జరగ్గా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
రంగంపేట గ్రామానికి చెందిన లకవత్ రజిత నిండు గర్భిణి. కరోనా స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆమెకు రెండు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్గా నిర్ధారించబడింది. అయితే బుధవారం ఉదయం గర్భిణికి పురిటినొప్పులు వచ్చాయి.
దీంతో ఆమెను ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. గర్భిణి కరోనా పేషెంట్ అని తెలిసినప్పటికీ.. విధుల్లో ఉన్న పుష్పలత, సుజాత, కీర్తి ఆమెకు పురుడు పోశారు. బాధితురాలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు మండల వైద్యాధికారి ధర్మ నాయక్ తెలిపారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, మెరుగైన వైద్య సదుపాయాల నిమిత్తం 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. కరోనా పేషెంట్కు పురుడు పోసిన వైద్య సిబ్బందిని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కపిల్ సాయి అభినందించారు.