వారబందీ పద్ధతి లేకుండానే సరఫరా చేయాలి
ఇరిగేషన్ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం
ఎమ్మెల్యే దాసరి విజ్ఞప్తికి సానుకూల స్పందన
పెద్దపల్లి, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములకూ వారబందీ పద్ధతి లేకుండా నిరంతరాయంగా నీటిని సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కలిశారు. ఎస్సారెస్పీ డీ-83, 86 కాలువల ద్వారా వార బందీ పద్ధతిలో నీటి విడుదల జరుగుతున్నదని, దీంతో చివరి ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించగా, సీఎం స్పందించారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో కాకుండా ఇక నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని, ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు తగ్గినా పర్వాలేదని రామగుండం ఇరిగేషన్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి ఆదేశించారు.
అలాగే పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరగా, ట్రాఫిక్ ఠాణా ఏర్పాటుకు డీజీపీని సీఎం ఆదేశించారు. సుల్తానాబాద్లో రాజీవ్ రహదారిపై డివైడర్లు ఏర్పాటు చేయడంతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం, ఆర్వోబీలు నిర్మించాలని కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత మంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కోర్టుకు స్థలం కేటాయించాలని కోరగా, త్వరలోనే నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ‘నమస్తే’కు ఫోన్లో వివరించారు. అంతకుముందు అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో దాసరి మాట్లాడారు. ఓదెల మల్లన్న ఆలయం అభివృద్ధికి నిధులివ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు హరితహారంలో భాగంగా మొక్కలను నాటామన్నారు. రోడ్ల పక్కన పెద్ద సైజ్ పోల్స్ ఏర్పాటు చేయడం ద్వారా చెట్లను నరికే అవసరం ఉండదన్నారు. గ్రామాల్లో థర్డ్వైర్, పట్టణాల్లో ఫిప్త్వైర్ను బిగించాలన్నారు. నిరంతరాయంగా నీటి విడుదలతో పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని చివరి ఆయకట్టు భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. తన విజ్ఞప్తికి స్పందించి నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసిన సీఎంకు ఎమ్మెల్యే దాసరి కృతజ్ఞతలు తెలిపారు.