కోరుట్లపేట 1961లో పంచాయతీగా ఏర్పడింది. గ్రామ జనాభా 1,364 కాగా, ఇందులో 684 మంది స్త్రీలు, 680 మంది పురుషులు ఉన్నారు. గ్రామ పంచాయతీ నిర్వహణ, అభివృద్ధి కోసం ఏడాదికి 22.36 లక్షలు నిధులు వస్తున్నాయి. అందులో గ్రీన్బడ్జెట్ కింద పది శాతం వినియోగించుకుని హరితహారం, నర్సరీ నిర్వహిస్తున్నారు. పారిశుధ్యమే ప్రథమ ప్రాధాన్యంగా 830 బుట్టలను పంపిణీ చేశారు. చెత్త సేకరణకు సైకిల్ రిక్షా, ట్రాక్టర్ను సమకూర్చుకున్నారు. ముగ్గురు పారిశుధ్య కార్మికులతో స్వచ్ఛ గ్రామానికి కృషి చేస్తున్నారు. చెత్త వేసేందుకు ఊరి పొలిమేరలో ఓ డంప్ యార్డును నిర్మించి నిర్వహిస్తున్నారు. ఇక వీధివీధినా సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో గ్రామస్తులు రాకపోకలు సాఫీగా సాగిస్తున్నారు.
ప్రగతిబాట..
పల్లె ప్రగతితో గ్రామ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. పది పాడుబడ్డ భవనాలు కూల్చివేశారు. ఏడు పాడుబడ్డ బావులను పూడ్చి వేయించారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో భాగంగా మూడు నూతన స్తంభాలు వేయించడంతోపాటు కొత్త విద్యుత్ తీగలను, 250 మీటర్ల థర్డ్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఊరి మొదట్లో స్వాగత తోరణాన్ని నిర్మించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం ఊరికే అందాన్ని తెస్తున్నది. అందులో అలంకరణ మొక్కలను పెంచారు. మొత్తంగా 400 మొక్కలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం సుందరంగా కనిపిస్తున్నది. ఇక కోరుట్లపేట-మల్లారెడ్డిపేట, కోరుట్లపేట-గంభీరావుపేట ప్రధాన రహదారితో పాటు అంతర్గత రోడ్లలో 600 మొక్కలు నాటగా, ఇందులో 582 ఏపుగా పెరిగి ఊరికి కొత్త శోభ తీసుకువచ్చాయి. ఇదిలా ఉండగా, ఊరి మీద మమకారంతో గ్రామానికి చెందిన దాతలు కూడా తమవంతు సహకారం అందించారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రవీణ్రావు 6లక్షలు, పాఠశాలలో బెంచీలు, ఇతర సామగ్రికి లక్ష ఖర్చు చేశారు. గ్రామంలో వాటర్ప్లాంటు ఏర్పాటుకు గండ్ర యాదగిరిరావు 5 లక్షలు ఖర్చు చేసి అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.