నాగార్జునసాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యం
ఎమ్మెల్సీ కవిత కోరిక మేరకు కొండగట్టుకు వచ్చా
మహబూబాబాద్ ఎంపీ కవిత
మల్యాల, ఏప్రిల్1: ఓట్ల కోసమే బీజేపీ నాయకులు గిరిజనులపై కపట ప్రేమను చూపిస్తున్నారని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత మండిపడ్డారు. నాగార్జున సాగర్ ఉప ఉన్నికల్లో గిరిజనుడికే టికెట్ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు, గిరిజనుల అభివృద్ధి కోసం నిజంగా కృషి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్కు పంపిన బిల్లు ను ఆమోదింపజేయాలని సవాల్ విసిరారు. గురువారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్న అనంతరం సానా కాటేజ్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ 3,882 లంబాడా తండాలను గ్రామ పంచాయతీలుగా అప్గ్రేడ్ చేశారని పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో తండాల అభివృద్ధి పట్టణాలకు దీటుగా జరుగుతున్నదన్నారు.
గిరిజనులకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదించి సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. తం డాల అభివృద్ధి విషయంలో గిరిజన ప్రజలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారని, నాగార్జునసాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ అఖండ మెజార్టీతో గెలువడం ఖాయమన్నారు. నిజామాబాద్ ఎమ్మె ల్సీ కవితను తమ నియోజకవర్గ పరిధిలోని సింగరేణి సమస్యలపై బుధవారం కలువగా కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకొని పారాయణంలో పాల్గొనాలని కోరారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే రవిశంకర్ ఆహ్వానం మేరకే కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చామన్నారు. మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొంటానన్నారు.