రాజమౌళి సినిమా జీవితం గురించి అందరికీ తెలుసు. ఈయన ఒక్కో సినిమా కోసం ఎంత కష్టపడతాడు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన ఓ సినిమాకు కమిట్ అయ్యాడంటే ఒక్కడు కాదు కుటుంబం అంతా కష్టపడుతుంటుంది. రాజమౌళి కలను నిజం చేయడానికి అంతా చెమటోడుస్తుంటారు. ఇప్పుడు కూడా ట్రిపుల్ ఆర్ సినిమా కోసమే కష్టపడుతున్నారు జక్కన్న ఫ్యామిలీ. దీనికోసం పగలు రాత్రి తేడా లేకుండా వాళ్లు పని చేస్తున్నారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయనున్నాడు రాజమౌళి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు ఇందులో. మరోవైపు ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. అక్కడే క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇందులో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇలాంటి సమయంలో రాజమౌళి కుటుంబానికి ఓ తీపికబురు అందుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన కోడలు తల్లి కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. రాజమౌళి కోడలు, కార్తికేయ భార్య పూజా ప్రసాద్ తల్లి కానుందనే ప్రచారం జరుగుతుంది. ఈమె ప్రముఖ దర్శకుడు దివంగత వి.బి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, జగపతిబాబు సోదరుడి కుమార్తె కావడం విశేషం. చిన్నప్పటి నుంచి కూడా గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది పూజా. ఈమె భక్తిగీతాలు పాడుతుంది. ఆమె పేరుతో సీడీలు కూడా విడుదలయ్యాయి.
ప్రముఖ దేవాలయాలలో భక్తి పాటలు పాడి పేరు తెచ్చుకున్న పూజ.. రాజమౌళి కుమారుడు కార్తికేయను 2018లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. జైపూర్ కోటలో అంగరంగ వైభవంగా ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. దీనికి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది వచ్చారు. మూడేండ్ల తర్వాత ఈమె తీపికబురు చెప్పనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలను రాజమౌళి కుటుంబం ధృవీకరించలేదు. మరోవైపు కార్తికేయ మాత్రం తన తండ్రి సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గానే కాకుండా సెకండ్ యూనిట్ దర్శకుడిగానూ సత్తా చూపిస్తున్నాడు. కథలు నచ్చితే నిర్మాతగానూ మారుతున్నాడు.