ముంబై: మహారాష్ట్రలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే శివసేన వర్గానికి చెందిన అభ్యర్థి రుతుజా లట్కేపై బీజేపీ ఎవరినీ పోటీకి దింపొద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్థాకరే.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. తన భర్త సిట్టింగ్ స్థానమైన అంధేరీ ఈస్ట్ను ఆమెకే వదిలేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అంధేరి ఈస్ట్ నియోజవర్గం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే అనారోగ్య కారణాలతో మరణించారు. దాంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్ ౩న ఆ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శివసేన ఆయన భార్య రుతుజా లట్కేను అక్కడి నుంచి బరిలో దించింది. ఏక్నాథ్ షిండే వర్గం బలపర్చిన బీజేపీ అభ్యర్థి ముర్జీ పటేల్ ఆమెపై పోటీ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాజ్థాకరే.. రుతుజాపై అభ్యర్థిని పోటీకి పెట్టవద్దంటూ దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. గత జూన్లో ఏక్నాథ్ షిండే ఉద్దవ్ థాకరేపై తిరుగుబాటు చేసి శివసేన పార్టీని చీల్చారు. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన నేతృత్వంలోని మహా కూటమి సర్కారును కుప్పకూల్చారు. పైగా అసలైన శివసేన తనదే అంటూ ఎన్నికల సంఘానికి అప్పీల్ చేశారు.
మరోవైపు ఉద్దవ్ థాకరే కూడా అసలైన శివసేన తనదేనని వాదిస్తున్నారు. తన పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు మాత్రమే బీజేపీకి అమ్ముడుపోయారని, ప్రజల్లో తన పార్టీకే ఎక్కువ ఆదరణ ఉందని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదం కొనసాగుతుండగానే అంధేరీ ఈస్ట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలుపు ఏ వర్గానికి ప్రజల మద్దతు ఉందో స్పష్టంచేసే అవకాశం ఉండటంతో.. ఉద్ధవ్, ఏక్నాథ్ షిండే వర్గాలు ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.