ముంబై, సెప్టెంబర్ 1: రాజ్ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొందరు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా ఒకరిపై దాడులకు తెగబడ్డారు. ఎంఎన్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టడం కోసం ప్రకాశ్ దేవీ అనే మహిళకు చెందిన మందుల దుకాణం ముందు కొందరు కర్రలు పాతారు. వాటిని తొలగించాలని పార్టీ కార్యకర్త వినోద్ అర్గిలే సహా కొందరు కార్యకర్తలకు బాధితురాలు విజ్ఞప్తి చేశారు.
కానీ అవేవీ పట్టించుకోకుండా.. వాళ్లు ఆమెను బలంగా నెట్టేశారు. చెంపపై కొడుతూ రోడ్డుపై పడేశారు. అంతటితో ఆగకుండా దారుణమైన బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆగస్టు 28న ఈ సంఘటన జరుగగా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితురాలు వాపోయారు.