హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్న విషయం విదితమే. గురువారం రోజు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి. ఇక హైదరాబాద్ నగరంలో అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
శుక్రవారం రోజు వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతేనే బయటకు రావాలని చెప్పింది.
శనివారం రోజు నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం రోజు ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్, ఖమ్మంతో పాటు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెరువులు, కుంటలు అలుగు పారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గల్లో అత్యధికంగా 122.3 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, చుక్కాపూర్లో 117 మి.మీ. వర్షపాతం నమోదైంది. నాగర్కర్నూల్ జిల్లాలోని బొల్లంపల్లిలో 90.3 మి.మీ., నారాయణపేట జిల్లాలోని గుండ్మాల్లో 87.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.