హైదరాబాద్ : బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పడమర ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. బుధవారం ఉదయం కొంత ఎండ కనిపించినప్పటికీ సాయంత్రానికి నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రేటర్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కురిసిన వానకు రహదారులపై వరదనీరు వచ్చి చేరింది.
రాత్రి 8 గంటల వరకు గ్రేటర్లోని హయత్నగర్లో అత్యధికంగా 4.7 సెం.మీ., శేరీలింగంపల్లిలోని ఖాజాగూడలో 3.1 సెం.మీ., రాజేంద్రనగర్లోని మైలార్దేవ్పల్లిలో 2.8 సెం.మీ., సరూర్నగర్లోని భవాని నగర్, లింగోజిగూడలో 1.9 సెం.మీ., హస్తినపురంలో 1.0 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలుండడంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్లో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ కేంద్రం.