హైదరాబాద్ : దక్షిణ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27 వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అలాగే తెలంగాణలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని పేర్కొన్నది. దీంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఈశాన్య దిశ ఉపరితల గాలులు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 26 జిల్లాల్లో వర్షం కురిసిందని, అత్యధికంగా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ), ఆదిలాబాద్ జిల్లా బోథ్ 5, వికారాబాద్ జిల్లా దోమ 3, నిర్మల్ జిల్లా సారంగపూర్ణ, కొమ్రంబీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లా సతుపల్లిలో రెండు సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వివరించింది. రాష్ట్రంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత సంగారెడ్డి కోహిర్లో 19.1, జీహెచ్ఎంసీ పరిధిలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 19.4 డిగ్రీలు.. అత్యధికంగా ఖమ్మం పట్టణంలో 37.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్ డీపీఎస్ పేర్కొన్నది.