హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. మరోవైపు మంగళవారం రాష్ట్రంలో పలుప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో అత్యధికంగా 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.