Railways| దేశంలో రైలు మార్గాలు వేయకముందు రోడ్డు మార్గాలు, జల రవాణా రూపంలో.. రెండు రకాలుగా రవాణా జరిగేది. అయితే బ్రిటిష్ వారు వచ్చేటప్పటికి రోడ్ల యాజమాన్యం అంత సరిగ్గా లేకపోయింది.
ఇలాంటి పరిస్థితుల్లో లండన్, మాంచెస్టర్ నగరాలకు చెందిన వ్యాపార సంస్థలు భారతదేశంలో రైలు మార్గాల అభివృద్ధికి చొరవ చూపించాయి. దీనివల్ల ఇంగ్లండ్ వస్త్ర పరిశ్రమకు అవసరమైన పత్తిని భారతదేశం నుంచి సులువుగా తరలించడానికి వీలవుతుందని వారి ఆలోచన. అంతేకాకుండా ఇంగ్లండ్లో తయారైన ఉత్పత్తులకు భారత్ మార్కెట్గా ఉపయోగపడుతుందని ఆంగ్లేయులు భావించారు. 1857 సిపాయీల తిరుగుబాటు తర్వాత భారతదేశంలో రైలు మార్గాల నిర్మాణం ముమ్మరమైంది. అలా 1853 ఏప్రిల్ 16 నాడు భారతదేశంలో రైల్వే యుగం ఉదయించింది. బొంబాయిలోని బోరి బందర్ నుంచి థాణే వరకు 21 మైళ్ల దూరానికి తొలి రైలు పరుగులు పెట్టింది. 1860లో కేవలం 838 మైళ్లు ఉన్న భారతీయ రైలు మార్గాల నెట్వర్క్ 1901 నాటికి 25,373 మైళ్లకు చేరుకుంది. కానీ తొలి నాళ్లలో ప్రజలు రైల్వేలను అంత అబ్బురంగా ఏమీ చూడలేదు. పైపెచ్చు వీటికి బ్రహ్మరాక్షసులు అని ముద్దుపేరు పెట్టుకున్నారు.
రైల్వేల అభివృద్ధి కేవలం బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే జరిగింది. భారతీయుల పన్నులతో నిర్మాణమైన రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఎక్కడా భారతీయులకు చోటుండేది కాదు. కేవలం మెకానిక్ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చేవాళ్లు. అయితే రైల్వేల అభివృద్ధి వల్ల ఒనగూరిన ఫలితం ఏదైనా ఉందా అంటే, దేశ ప్రజలు సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి వీలైంది. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల అంశాలపట్ల అవగాహన పెరిగింది. ఆయా ప్రాంతాలకు చెందిన మేధావుల మధ్య భావప్రసారం జరగడంతో 1880ల నుంచి దేశమంతటా జాతీయ భావాలు వీయడం మొదలైంది. భారత స్వాతంత్య్రోద్యమ సారథి భారత జాతీయ కాంగ్రెస్ 1885లో ఏర్పడటానికి రైల్వేల అభివృద్ధి కూడా ప్రధాన కారణంగా నిలిచింది.