న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 30న చామరాజనగర్ జిల్లా నుంచి కర్నాటకలోకి చేరుకోనుంది. రాష్ట్రంలో రాహుల్ యాత్ర చేరుకునే ముందు రాహుల్కు స్వాగతం పలుకుతూ గుండ్లుపేట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోస్టర్లను కొందరు చించివేశారు. యాత్రకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన 40 పోస్టర్లను కొందరు చించివేశారు. గుండ్లుపేట్ హైవేపై ఏర్పాటైన పోస్టర్లను బీజేపీ కార్యకర్తలు చించివేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు రాహుల్ భారత్ జోడో యాత్ర గురువారం కేరళలో చివరి రోజున నీలంబర్లో ప్రారంభమైంది. కర్నాటకలో పాలక బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పలు ఆందోళనలు చేపడుతున్న నేపధ్యంలో రాహుల్ యాత్ర పార్టీకి మరింత ఊపునిస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
కర్నాటకలో రాహుల్ యాత్రను విజయవంతం చేసేందుకు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం, సీనియర్ నేత సిద్ధరామయ్య సహా సీనియర్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేపడుతున్నారు. భారీగా జనసమీకరణ చేసి రాహుల్ యాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు శ్రమిస్తున్నాయి.