యాసంగి వడ్ల కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం పెడుతున్న పేచీతో రైస్మిల్లుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. బియ్యం సేకరించే ప్రసక్తే లేదన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తుండడం మిల్లర్ల పాలిట శాపంగా మారింది. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి, మిల్లులను నడుపుతున్న వందలాది కుటుంబాలపై ఆర్థిక భారం పడనుంది. మరో వైపు మిల్లుల్లో పనిచేస్తున్న వేలాది టుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనున్నది. ధాన్యం కొనే ముచ్చటే లేదని ఇప్పటికే కేంద్రం తెగేసి చెప్పడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొనగా, వరి పండించకపోతే రైస్మిల్లులు ఖాళీగా ఉండి, తమ బతుకులు ఏం కావాలంటూ మిల్లర్లు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న కూలీలు దిగాలు చెందుతున్నారు. వడ్లు కొంటారా? కొనరా? అనే స్పష్టమైన హామీ వస్తే తప్పా, రైస్ మిల్లుల కొనసాగింపు కష్టమేనని మిల్లర్లు పేర్కొంటున్నారు.
అందోల్, డిసెంబర్ 8:యాసంగిలో వడ్లు కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో జిల్లాలో రైస్మిల్లుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మిల్లర్ల పాలిట శాపంగా పరిణమించింది. కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి, మిల్లులను నడుపుతున్న వందలాది కుటుంబాలపై ఆర్థిక భారం పడనుంది. మరోవైపు మిల్లుల్లో పని చేస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడనున్నది. సంగారెడ్డి జిల్లాలో 45 రారైస్, 18 బాయిల్డ్ రైస్ మిల్లు లు నడుస్తుండగా, వేలాది మంది కార్మికులకు ఉపాధి దొరుకుతున్నది. మన జిల్లా.. మన రాష్ట్రం వారే కాకు ండా పక్క రాష్ర్టాల నుంచి సైతం పొట్ట చేతబట్టుకుని వచ్చిన వందలాది కుటుంబాలు కొన్నేండ్లుగా రైస్మిల్లుల్లో పనిచేస్తూ బతుకుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో వారి బతుకులు ఆగమవుతున్నా యి. అన్నదాతలు పండించిన పూర్తి ధాన్యాన్ని కొని, మార్కెటింగ్ చేసి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ, ఆ దిశ గా ఎలాంటి స్పందన కనబడడం లేదు. ఈ యాసంగి సీజన్లో ధాన్యం కొనే ముచ్చటే లేదని ఇప్పటికే కేంద్రం తెగేసి చెప్పడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొన్నది. వరి పండించకపోతే రైస్మిల్లులు ఖాళీగా ఉండి, తమ బతుకులు ఏం కావాలంటూ మిల్లర్లు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న కూలీలు దిగాలు చెందుతున్నారు.
స్వరాష్ట్రంలో పెరిగిన ధాన్యం దిగుబడి…
ఉమ్మడి రాష్ట్రంలో ఆదరణ లేక కుంటుపడిన వ్యవసా య రంగం, తెలంగాణ వచ్చాక స్వరాష్ట్రంలో కొత్త పుం తలు తొక్కింది. రాష్ట్రం ఏర్పడి.. రైతుబిడ్డ కేసీఆర్ సీఎం కావడంతో ఆయన చేపట్టిన కొత్త సంస్కరణలో వ్యవసాయ రంగంలో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచింది. వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, రైతుబంధుతో పంట పెట్టుబడి, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, రైతుబీమా లాంటి గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టారు. దేశం ఆశ్చర్యపడేలా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, కాలువల ద్వారా నీరందించడంతో ఒకప్పుడూ బీడుపడిన భూములు, ఇప్పుడు పచ్చని పంటలతో కళకళలాడుతూ పుట్లకొద్ది ధాన్యం రాశులు ఇండ్లకు చేరుతున్నాయి. పల్లెల్ల్లో సరైన ఉపాధిలేక పట్టణాలకు వలస వెళ్లిన వారు గ్రామాలకు వచ్చి సొంతూర్లలో ఉపాధి పొందుతున్నారు. అందోల్ నియోజక వర్గంలోని సింగూరు ప్రాజెక్టు నీటితో కళకళలాడుతుండగా, పరీవాహకంలో కొనేండ్లుగా రైతులు పుట్లకొద్ది ధాన్యం పండించారు. ధాన్యం రాశులతో మిల్లులు సందడి కనబడుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి కారణంగా ఈ సందడి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతుందేమోనని రైతులు వాపోతున్నారు.
కేంద్రం వైఖరి మార్చుకోవాలి..
కేంద్ర ప్రభుత్వం పెడుతున్న నిబంధనలు తమకు శాపంలా ఉన్నాయని మిల్లర్లు పేర్కొంటున్నారు. రైతులు పండించిన పూర్తి పంటను కొని, దానిని మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే.. అయినా ఆ మేరకు వారు పని చేయడం లేదని చెబుతున్నారు. వచ్చే యాస ంగిలో బియ్యం సేకరించే ప్రసక్తే లేదన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో మిల్లుల నిర్వహణ, తమను నమ్ముకొని మిల్లుల్లో పని చేస్తున్న వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. కేంద్రం తీరుపై రైతులు.. రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రోడ్లపై ధర్నాలు చేసినా చీమ కుట్టినైట్లెనా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ఎంపీలు సైతం రైతుల పక్షాన తమ గొంతును.. రైతుల గోడును వినిపిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు. వడ్లు కొంటారా? కొనరా? అనే స్పష్టమైన హామీ వస్తే తప్పా, రైస్మిల్లుల కొనసాగింపు కష్టమేనంటున్నారు. కొద్ది రోజులుగా ధాన్యం దిగుబడి విపరీతంగా పెరగడంతో ఆరునెలల క్రితమే ఒక్కో మిల్లును రూ.70లక్షల నుంచి రూ.80 లక్షలు వెచ్చించి ఆధునీకరించామని, ఇప్పుడు కేంద్ర నిర్ణయం తమకు ఎంతో నష్టం కలిగిస్తున్నదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో మిల్లు నిర్వహణకు ప్రతినెలా రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుందని, వీటిలో కరెంట్ బిల్లు, లారీ డ్రైవర్లు, కూలీలు, హమాలీలు.. ఇలా ఎంతో మందికి జీతాలు.. జీవితాలు ఆధారపడి ఉంటాయని పేర్కొంటున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని వడ్లు కొనాలని, లేదంటే ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు.
ధాన్యం కొంటేనే రైస్ మిల్లులు నడిచేది
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనమని చెప్పడం సరికాదు. రైతులు పండించిన పూర్తి ధాన్యాన్ని కొని, దానిని మార్కెటింగ్ చేయాల్సిన బాధ్య త కేంద్రానిదే. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం దిగుబడులు విపరీతంగా పెరిగాయి. దీంతో దానికి అనుగుణంగా మిల్లర్లు సైతం రూ.కోట్లు వెచ్చించి, మిల్లులను కొద్ది రోజుల క్రితమే ఆధునీకరించారు. ఇప్పుడూ కేంద్ర నిర్ణయంతో రైతులు ఇబ్బందులు పడడంతో పాటు మిల్లలు ఖాళీగా ఉండి కోట్ల రూపాయల సామగ్రి పాడవుతుంది. కూలీల బతుకులు దుర్భరంగా మారడంతో పాటు మిల్లర్లు తీవ్రంగా నష్టపోతారు.
కేంద్రం మొండివైఖరి వీడాలి
కేంద్రం మొండివైఖరి వీడి ధాన్యాన్ని కొనాలి. లేదంటే రైతులు, మిల్లర్లు, కూలీలు రోడ్డున పడతారు. రైతు కుటుంబం నడవాలంటే సాగు చేయాలి. మిల్లు నడవాలంటే ధాన్యం కావాలి. కూలీలు బతకాలంటే పని ఉండాలి.. ఇలా ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం వ్యవహరించాలి. ధాన్యం కొనుగోలు చేయకపోతే భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా మిల్లర్లు ఆర్థికంగా నష్టపోతారు. అందులో పనిచేసే వారూ రోడ్డున పడతారు. కోట్ల రూపాయల మిషినరీ పాడవడం, కూలీలు, సిబ్బందికి వేతనాలు చెల్లించలేక వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది.
బీహార్ వెళ్తే పస్తులుండాలి..
కొన్నేండ్లుగా ఇక్కడి రైస్మిల్లులో పనిచేస్తున్నాం. కరోనాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించగా, చాలామంది సొంత రాష్ర్టాలకు పోయారు. మేం మాత్రం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు పనులు లేకా మేము బీహార్కు వెళ్తే పస్తుంలుండాలే తప్ప, పనులు దొరకవు. మాకు రైస్మిల్లు పని తప్పా వేరేది రాదు. కేంద్రం ఎప్పటిలాగే ధాన్యం కొంటే బియ్యం పడుతూ ఇక్కడే పనులు చేస్తూ కడుపునిండా తింటూ సంతోషంగా ఉండిపోతాం. – పప్పుసదా, రైస్మిల్లు కార్మికుడు, బీహార్