న్యూఢిల్లీ: భారత్లో తొలివిడత కన్నా మలివిడత కరోనా విస్తరణ తీవ్రస్థాయిలో ఉండడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకోకపోవడమే కారణమని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ పరోక్ష విమర్శలు చేశారు. బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ప్రస్తుత కరోనా కల్లోలానికి నాయకత్వ పటిమ, ముందుచూపు, సన్నద్ధత లోపించడమే కారణమని దుయ్యబట్టారు. కీలక వైద్య పరికరాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా, హాస్పిటల్ బెడ్స్, మందులు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలు సకాలంలో పట్టించుకుంటే బాగుండేదని ఆయన అన్నారు. భారతీయ అధికారుల్లో కరోనా విషయమై ఏర్పడిన అనవసరమైన ధీమా కూడా కల్లోలానికి తోడైందని అన్నారు. పూర్తిగా కరోనా ముప్పు తొలగిపోలేదన్న సంగతి దృష్టిలో ఉంచుకోకపోవడం వల్ల సమస్య జటిలమైందని రఘురాం రాజన్ అభిప్రాయ పడ్డారు. బ్రెజిల్ వంటి దేశాల్లో రెండో విడత కోరలు సాచడం చూస్తే ఇది అంత సులభంగా పోయే సమస్య కాదని అర్థమవుతుందని, పైగా వైరస్ కొత్తకొత్త అవతారాలు ఎత్తడం తలనొప్పిగా తయారైందని అన్నారు. అనేకమంది భారత ప్రభుత్వ అధికారులు కరోనా కల్లోలంపై విజయం సాధించినట్టు తొందరపడి ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. టీకాల కార్యక్రమం నత్తనడక సాగడం కూడా వైరస్ వ్యాప్తికి కారణమైందని ప్రస్తుతం షికాగో యూనివర్సిటీ అర్థశాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు.