నారాయణఖేడ్, సెప్టెంబర్ 7 : రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చి సమూల మార్పులు తెచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ ఏరియా దవాఖానను తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
రెండు నెలల్లో అన్ని దవాఖానల పనితీరు, భవనాల స్థితిగతులపై పరిశీలన జరిపి అవసరమైన రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య, రోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సహకారంతో ప్రభుత్వ వైద్యాన్ని మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి దవాఖానకు సంబంధించి ప్రతి 15 రోజలుకు ఒకసారి సమీక్ష నిర్వహించి అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు.
రోగులకు ఇచ్చే రోజువారి ఆహార పదార్థాల మెనూను బహిరంగంగా అందరికి తెలిసే విధంగా ఏర్పాటు చేయాలని వైద్యాధికారులను ఆదేశించామన్నారు. స్థానికంగా ఏరియా దవాఖాన ఆవరణలోనే నిర్మిస్తున్న 50 పడకల మాతాశిశు దవాఖాన సైతం త్వరలోనే ప్రారంభించ నున్నట్లు తెలిపారు.స్థానిక ఏరియా దవాఖానలో తక్కువ సంఖ్యలో ప్రసవాలు చేయడం, సేవల పరంగా పలు లోపాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
వైద్యుల తీరుపై అసహనం..
నారాయణఖేడ్ ఏరియా దవాఖానను తనిఖీ చేసిన అజయ్కుమార్ స్థానిక వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. రోగులకు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి నమోదు చేయాల్సి ఉండగా, అవేవి చేయకుండానే మొక్కుబడిగా నమోదు చేయడమేమిటని మండిపడ్డారు. ఆయన వెంట సంగారెడ్డి డీసీహెచ్ఎస్ సంగారెడ్డి ఉన్నారు.