యాక్షన్ చిత్రాలు ‘బాహుబలి’, ‘సాహో’ తర్వాత ‘రాధేశ్యామ్’ వంటి ప్రేమకథలో నటించడం కిక్ ఇచ్చిందని అన్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్. ఈ సినిమాను థ్రిల్లర్ లవ్స్టోరిగా అభివర్ణించారాయన. ఈ సినిమా మార్చి 11న విడుదలవుతున్నది. పూజా హెగ్డే నాయిక. గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో దర్శకుడు రాధాకృష్ణకుమార్ రూపొందించారు. తాజాగా ఈ సినిమా విశేషాలను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో చిత్రబృందం వివరించారు.
వంశీ, ప్రమోద్ పంపగా దర్శకుడు రాధాకృష్ణ నా దగ్గరకు వచ్చారు. మీరు ఈ చిత్రంలో హస్తసాముద్రికుడి పాత్రలో కనిపిస్తారు అన్నారు. నేను జాతకాలు నమ్మను..పామిస్ట్ క్యారెక్టర్ అంటున్నాడు సగం కథ అయ్యాక వద్దని చెప్పేద్దాం అనుకున్నా. కానీ ఇంటర్వెల్ అయ్యాక పూర్తిగా విందాం అనిపించింది. అలా మొత్తం కథ వింటుంటే నేను ఏం చెప్పాలన్నది మర్చిపోయి..కథలో లీనమయ్యాను. కథ పూర్తయ్యాక ఈ సినిమా చేసేద్దామని చెప్పాను. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాల తర్వాత నాకు లవ్స్టోరి చెప్పేందుకు మిగతా దర్శకులు సందేహించారు. రాధా మాత్రం ధైర్యంగా వచ్చి చెప్పాడు. సినిమాను కూడా అంతే అందంగా రూపొందించాడు. నన్ను ఒక ప్రేమకథలో ఎలా చూపిస్తే బాగుంటుందో అలాగే తెరకెక్కించాడు. మరో స్థాయి ప్రేమకథకు రూపకల్పన చేశాడు. నాకు ఈ సినిమా కిక్ ఇచ్చింది. విక్రమాదిత్య పాత్రలోనే మాస్ ఉంది. ట్రైలర్లో చూపించినట్లు నాకు రెండోసారి చూసే అలవాటు లేదు వంటి డైలాగ్స్ ఉంటాయి. ‘రాధేశ్యామ్’ ఒక థ్రిల్లర్ లవ్స్టోరి అనుకోవచ్చు. యాక్షన్ ఉంటుంది కానీ ఫైట్స్ ఉండవు. కార్, బైక్ ఛేజింగ్ సీన్స్ ఉంటాయి. షిప్ ఎపిసోడ్ కోసం దర్శకుడు రెండేళ్లు కష్టపడ్డాడు. ఇది సినిమాలో 13 నిమిషాలు ఉంటుంది. అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా రూపకల్పనలో చాలా కష్టపడ్డాం. విదేశాలకు పదే పదే వెళ్లి షూటింగ్ చేసుకురావడం అంటే సులువు కాదు. గోపీకృష్ణా మూవీస్ పెదనాన్న కృష్ణంరాజుకు ఎన్నో విజయాలు ఇచ్చిన సంస్థ. 13 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆ సంస్థలో ‘బిల్లా’ చేశాం. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ నిర్మించాం. పెదనాన్నకు నేను జవాబుదారీగా ఉండాలని ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. కానీ ఆయన సినిమా నాణ్యంగా రావాలి ఏం కావాలో చేయండి అనేవారు. ఆయన పరమహంస అనే పాత్రలో నటించారు. ఆ పాత్రలో విజ్ఞానంతో పాటు వ్యంగ్యం ఉంటుంది. ‘రాధేశ్యామ్’కు సాంకేతిక నిపుణుల పనితనం ప్రధాన ఆకర్షణ అవుతుంది. రవీందర్ ఆర్ట్ వర్క్ ఆకట్టుకుంటుంది. మేము మొదట విడుదల చేసిన పియానో స్టిల్ దగ్గర నుంచి సినిమాలో కనిపించే ప్రతి ఆర్ట్ వర్క్ వెనక ఎంతో శ్రమ, రీసెర్చ్ దాగి ఉంది. థమన్ సినిమాలో చేరాక మాకు ధైర్యం వచ్చింది. రీరికార్డింగ్తో సినిమా చూశాక మేము అనుకున్న ఫీల్కు మరో భిన్నమైన అనుభూతి కలిగింది. థమన్ సినిమాను ఇంకోలా ఆవిష్కరించాడు. రసూల్ పూకుట్టి చేసిన విజువల్ ఎఫెక్ట్లు చాలా బాగుంటాయి. నిక్ పాల్ అనే హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు పనిచేశారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ ప్రేమకథకు ఆత్మనిచ్చాడు. నాకు చాలా ఇష్టమైన పాటలు స్వరపర్చాడు. బయట వాళ్లకు సినిమా చేస్తే నా పని వరకు సరిగ్గా చేశానా లేదా అని చూసుకుంటాను. ఇక్కడ సొంత నిర్మాణ సంస్థ కాబట్టి సినిమా ప్రొడక్షన్ విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోవాల్సి వచ్చింది. అమితాబ్ బచ్చన్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాము. అలాగే ‘పాజెక్ట్ కె’లో ఆయనతో కలిసి నటించడం కల నిజమైన అనుభూతిని ఇస్తున్నది. త్వరలో ఒక కామెడీ మూవీ కూడా చేస్తున్నా.
ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులు అంతా అనుబంధంతో పనిచేశారు. ఒకరి చేయి మరొకరు పట్టుకుని నాణ్యమైన సినిమా ఇచ్చేందుకు ప్రయాణం సాగించారు. నాకు సరైన విజయాలు లేని సమయంలో యూవీ క్రియేషన్స్ సంస్థ ‘మహానుభావుడు’ అనే చిత్రాన్ని ఇచ్చింది. ‘రాధేశ్యామ్’ నేను ఈ సంస్థకు తిరిగి ఇచ్చే బహుమతి అనుకోవచ్చు. ప్రభాస్ తెలుగు సినిమాను ఎల్లలు దాటించాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమా మొదటి ఆట చూసేందుకు వేచి చూస్తున్నది. ప్రతి సన్నివేశం మరో స్థాయికి కథను తీసుకుంటూ వెళ్తుంది.
ఈ సినిమాకు రెండు కష్టమైన పనులు అంటే ఒకటి కృష్ణంరాజుకు కథ చెప్పి మెప్పించడం రెండు షూటింగ్ పూర్తి చేయడం. కథ చెప్పాక ఆయన ఇచ్చిన సూచనలు విని నేనూ ప్రభాస్ ఆశ్చర్యపోయాం. పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో మిమ్మల్ని మెప్పిస్తుంది. ఆమె క్యారెక్టర్ను మీతో పాటు తీసుకెళ్తారు. విక్రమాదిత్యగా ప్రభాస్ ఒక అందమైన కలగా అనిపిస్తాడు. ప్రభాస్ లేకుంటే రాధేశ్యామ్ లేదు. నాకు ఆయన ఇచ్చిన సహకారం మర్చిపోలేను. సినిమాకు దాదాపు 300 కోట్ల రూపాయల ఖర్చు అయ్యింది. అయితే సినిమా చూస్తే మీరు వెయ్యి కోట్ల రూపాయల సినిమా అనే అనుభూతి పొందుతారు.