భద్రాచలం, అక్టోబర్ 13: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాల వల్ల వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలుగుతున్నదని సినీ నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు చట్టాలతో దేశానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదన్నారు. కరోనా సమయంలో దేశ ప్రజలంతా మాస్కులు ధరించి, శానిటైజర్లు వాడుతూ ఇంట్లో కూర్చుంటే.. ఒక్క రైతు మాత్రమే దేశం కోసం పంటలు పండించారని ఆయన గుర్తుచేశారు. సంక్షోభ సమయంలోనూ అన్నం పెట్టిన రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. రైతు పంటలు పండించకపోతే ఏమవుతుందో ఆలోచించాలన్నారు. మోదీ సర్కార్ కార్పొరేట్లకు అనుకూలంగా రైతు చట్టాలు రూపొందించిందని ధ్వజమెత్తారు. స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని ఎన్నికల్లో గెలిచిన మోదీ.. తర్వాత ఆ హామీని పక్కన పెట్టాడని విమర్శించారు. రైతులకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ‘రైతన్న’ సినిమా తీశానని, ప్రతిఒక్కరూ ఆ సినిమా చూసి ఆదరించాలని కోరారు.