దేశ సాంకేతిక రహస్యాలను విదేశీయులకు చేరవేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘రాకెట్రీ, ద నంబి ఎఫెక్ట్’. ఈ చిత్రాన్ని ట్రై కలర్ ఫిలింస్, వర్గీస్ మూలన్ పిక్చర్స్, 27ఎంటర్టైన్మెంట్ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రూపొందించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించారు హీరో ఆర్ మాధవన్. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్ మాధవన్ మాట్లాడుతూ…‘సైనికులతో పాటు శాస్త్రవేత్తలు దేశానికి నిజమైన హీరోలు. వాళ్ల త్యాగాలకు సరైన గుర్తింపు దక్కదు. మన రాకెట్లలో వాడే వికాస్ ఇంజిన్ రూపకర్తల్లో ముఖ్యులు ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. ఆయన జీవిత కథ గురించి తెలిసినప్పుడు అందులో ఎంతో నాటకీయత ఉందనిపించింది.
ఈ బయోపిక్ గురించి చెబితే ఆయన ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. దేశ రహస్యాలను విదేశీయులకు చెప్పాననే ఆరోపణలు రావడంపై ఎంత బాధపడ్డారో తెలిపారు. ఈ కేసులో నంబి నారాయణన్ ప్రమేయంపై సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. అయినా దేశద్రోహి అనిపించుకున్న బాధ ఆయనలో పోలేదు. ఎంతోమంది అధికారులను కలిసి ఆయన కేసుపై రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రాశాను, నిర్మాణ దర్శకత్వ బాధ్యతలూ తీసుకున్నాను. ఇలాంటి మంచి కథలో నటించే అవకాశం వదులుకోలేక నేనే ప్రధాన పాత్రలో నటించాను. ఇస్రో అభివృద్ధిలో నంబి నారాయణన్ చేసిన కృషి, ఆయనపై మోపబడిన కేసు..ఈ రెండు అంశాలను సినిమాలో ఎక్కువగా చూపించాం. నేను రంగ్ దే బసంతి, త్రీ ఇడియట్స్ లాంటి సినిమాలు చేయడం వల్ల బాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నాను’ అన్నారు.